యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం: నేడే సుప్రీం విచారణ, తీర్పుపై ఉత్కంఠ
బెంగళూరు: కర్ణాటక గవర్నర్ నిర్ణయం, యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలని కాంగ్రెస్, జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. గురువారం తెల్లవారుజామునే ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరిపిన జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రమాణస్వీకారంపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు: బీజేపీ ముందున్న మార్గాలివే!
అయితే మరోమారు వాదనలు వింటామని, యడ్యూరప్ప ప్రమాణస్వీకారం అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఈమేరకు శుక్రవారం ఉదయం 10.30గంటలకు వాదనలు విననుంది.
కాంగ్రెస్, జేడీఎస్ తరఫున అభిషేక్ సింఘ్వి, కేంద్రం తరఫున ఏజీ వేణుగోపాల్ వాదనలు వినిపించనున్నారు. పూర్తి మెజార్టీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యడ్యూరప్పకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఎమ్మెల్యేల తమ పార్టీలోకి తీసుకోవడం ఫిరాయింపు నిరోధక చట్టం కిందికి వచ్చే అవకాశం ఉండటంతో బీజేపీ ఇతర మార్గాలను ఎంచుకుంటోంది. విశ్వాస పరీక్ష సమయంలో ఇతర పార్టీల అసంతృప్త ఎమ్మెల్యేలను దూరంగా ఉండేలా చూడనుంది. దీనిపై బీజేపీలో చర్చ సాగుతున్నట్లు సమాచారం.
ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు.. అతిపెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా ఆహ్వానించాలని చెప్పిందని బీజేపీ గుర్తు చేస్తోంది. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.