దేశంలో అత్యంత చవకైన కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే: రూ. 500కే బయోలాజికల్ ఇ కార్బివాక్స్ టీకా
హైదరాబాద్: నగరం నుంచి మరో కరోనా వ్యాక్సిన్ వస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్(బీఇ) అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ దేశంలో అత్యంత చవకైన వ్యాక్సిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు జరుపుకుంటున్న ఈ టీకా రెండు డోసుల ధర కలిపి రూ. 500గా ఉండనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంతకంటే తక్కువకు కూడా లభించే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి.
దేశంలోనే అత్యంత చవకైన కరోనా టీకా బయోలాజికల్ ఇ నుంచే..
ఒక వేళ రూ. 500కే రెండు డోసులు లభిస్తే(ప్రభుత్వాలకు, ప్రవైటుకు ఈ ధరకే విక్రయిస్తే) దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్ బయోలాజికల్ ఇ అందించనట్లవుతుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు ఇంతకంటే ఎక్కువ ధరనే కలిగివున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిషీల్డ్ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 600కు రెండు డోసులు, ప్రైవేటుకు రూ. 1200కు రెండు డోసులుగా నిర్ణయించి విక్రియస్తోంది.
హైదరాబాద్ నుంచే మరో కరోనా వ్యాక్సిన్..
హైదరాబాద్కు చెందిన మరో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ ధర ప్రభుత్వాలకు రూ. 800 రెండు డోసులకు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 2400కు రెండు డోసులు విక్రయిస్తోంది. ఇక రష్యా టీకా స్పుత్నిక్ వీ ధర ఒక్కో డోసుకు రూ. 995గా నిర్ణయించినట్లు డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికన్నా బయోలాజికల్ ఇ వ్యాక్సిన్ కార్బివాక్స్ ధర అత్యంత చవకని చెప్పవచ్చు. కోవాగ్జిన్, కార్బివాక్స్ను రెండు కూడా హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజాలే కావడం గమనార్హం.
బయోలాజికల్ ఇతో టీకాల కోసం కేంద్రం భారీ ఒప్పందం..
అమెరికాకు చెందిన బేలార్ కాలేజీ ఆఫ్ మెడిసిన్తో కలిసి బయోలాజికల్ ఇ సంస్థ కార్బివాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ మొదటి రెండు ట్రయల్స్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బయోలాజికల్ ఇ నుంచి 30 కోట్ల టీకా డోసుల కోసం ఒప్పందం కుదర్చుకుంది. ఇందుకోసం కేంద్రం రూ. 1500 కోట్లను బయోలాజికల్ ఇకి త్వరలోనే అడ్వాన్స్గా ఇవ్వనుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ తర్వాత అత్యవసర వినియోగానికి తమ టీకాను అనుమతించాలని సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసింది. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2022 వరకు ఒక బిలియన్ వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Recommended Video