అటల్ టన్నెల్ అద్భుతమే: మనాలి-లేహ్లను కలుపుతూ ప్రపంచంలోనే పొడవైన హైవే టన్నెల్
న్యూఢిల్లీ: అద్భుత నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. మానాలీ-లేహ్లను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన(9.2 కిలోమీటర్లు) అటల్ హైవే టన్నెల్ సముద్ర మట్టానికి సుమారు 10వేల ఫీట్ల ఎత్తులో నిర్మాణం జరిగింది. మొదట ఆరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేసినప్పటికీ.. ఈ నిర్మాణం పూర్తి కావడానికి పదేళ్ల సమయం పట్టింది.
Recommended Video
అటల్ టన్నెల్ ఓ అద్భుతమే..
‘అటల్ టన్నెల్'.. మనాలీ, లేహ్లను కలుపుతూ 10,000 ఫీట్లు ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ అని చీఫ్ ఇంజినీర్ కేపీ పురుషోత్తమ్ తెలిపారు. ఈ నిర్మాణాన్ని ఆరేళ్లలోపే పూర్తి చేస్తామని భావించినప్పటికీ.. నిర్మాణం పూర్తి కావడానికి పదేళ్ల సమయం పట్టిందని వెల్లడించారు.
సీసీ కెమెరాలు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు..
టన్నెల్ లోపలి భాగంలో ప్రతీ 60 మీటర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, ప్రతీ 500 మీటర్లకు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఇంజినీర్ వివరించారు. ఈ టన్నెల్ నిర్మాణం కారణంగా మనాలీ-లేహ్ ల మధ్య 46 కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుందని, నాలుగు గంటల సమయం కలిసి వస్తుందని చెప్పారు.
అగ్ని ప్రమాదాలు జరిగినా..
టన్నెల్ లోపల ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు ఫైర్ హైడ్రాంట్స్ కూడా అమర్చినట్లు పురుషోత్తం తెలిపారు. లోపలి భాగంలో నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు వనరులు ప్రవేశం, తిరిగి బయటికి తీసుకురావడం చాలా కష్టమైన పని అని తెలిపారు. ఈ నిర్మాణం పూర్తి చేసేందుకు అనేక సవాల్లను ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఈ టన్నెల్ 10.5 మీటర్ల వెడల్పు, ఒక మీటర్ ఫుట్పాత్ ఇరువైపులా కలిగివుందని వివరించారు.
పదేళ్ల టన్నెల్ నిర్మాణంలో అనేక సవాళ్లు..
అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్నల్ పరిక్షిత్ మెహ్రా మాట్లాడుతూ.. అనేక మంది నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటూ నిర్మాణం పూర్తి చేశామని, వారి సూచనలతో పలు మార్పులను కూడా చేశామని తెలిపారు. ఈ నిర్మాణం మాకు ఒక కల అని చెప్పారు. ఈ టన్నెల్ ప్రాజెక్ట్ ఒక సవాల్.. ఎందుకంటే రెండు వైపుల నుంచి పనులు చేయాల్సి ఉంటుంది. ఉత్తరంలో ఉన్న మరో ముగింపు రోహ్తంగ్ పాస్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏడాదిలో కేవలం ఐదు నెలలు మాత్రమే పనులు చేసేందుకు వీలు ఉంటుందని వివరించారు. కాగా, సుమారు పదేళ్లపాటు శ్రమించి పూర్తి చేసిన ఈ నిర్మాణం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.