అయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తు
న్యూఢిల్లీ:అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే రామమందిరం నిర్మాణంకు కేంద్ర హోంశాఖ ట్రస్టును ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. ప్రస్తుతం అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కాపీని నిపుణుల బృందం స్టడీ చేస్తున్నట్లు సమాచారం. తీర్పులో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుని సాధ్యసాధ్యాలపై నిపుణుల బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రహోంశాఖ అప్పుడే ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
తాత వద్దన్నారు.. మనువడు ఓకే చెప్పారు: రాజీవ్ నిర్ణయమే అయోధ్య వివాదానికి కారణమా?
గత 70 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న అయోధ్య వివాదం కేసులో నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరచించింది. వివాదాస్పద స్థలంలో ఉన్న బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కూల్చివేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి దీనిపై ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. చివరిగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై వరుసగా 40 రోజులు వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమిని రామమందిరంకే చెందుతుందనే ఏకగ్రీవ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. అదే సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ఐదెకరాల భూమిని కేటాయించాలంటూ కేంద్రానికి సూచనలు చేసింది.
ఇక మందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ ట్రస్టు ఆధ్వర్యంలోనే మందిర నిర్మాణం జరగాలని వెల్లడించింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ నిపుణు బృందంకు ఈ బాధ్యతను అప్పగించింది. 1045 పేజీలు ఉన్న తీర్పు కాపీని ఈ బృందం స్టడీ చేస్తోంది. ఈ నిపుణుల బృందంలో బ్యూరోక్రాట్లు ఉన్నారు. అంతేకాదు కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర హోంశాఖ అటార్నీ జనరల్, న్యాయశాఖ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం.