DIWALI 2022: దీపకాంతుల్లో మెరిసిన అయోధ్య- గిన్నిస్ రికార్డు..!!
పవిత్ర అయోధ్య నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అయోధ్యలో దీపావళి దీప కాంతులతో మెరిసిపోయింది. సరయు నది తీరంలో దీపోత్సవం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆరేళ్లుగా అయోధ్యలో దీపోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ సారి ప్రధాని మోదీ అయోధ్య కు రావటం..దీపోత్సవ్ కు హాజరు కావటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత పెరిగింది. సరయూ నది ఒడ్డున 22 వేల మంది వలంటీర్లు తో 18 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డును సృష్టించారు. మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో, రాంలీలా కార్యక్రమాలు జరిగాయి. దీపాల కాంతుల్లో అయోధ్య మెరిసిపోయింది.
ప్రధాని మోదీ అయోధ్య రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్ట్ 5, 2020న రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ప్రధాని మోదీ శ్రీరామ్ లాలాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర నిర్మాణపు పనులను సమీక్షించారు. శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేయడంతోపాటు సీతారాములకి, లక్ష్మణుడికి హారతి ఇచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి దాదాపు రూ.4వేల కోట్ల విలువైన పథకాలకు శ్రీకారం చుట్టారు. రాముడి పవిత్ర జన్మస్థలం నుంచి దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. అయోధ్యలో జరిగే దీపోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించడం సంతోషంగా ఉందని చెప్పారు.
రాముడి నుంచి దేశ ప్రజలు చాలా నేర్చుకోవాలన్నారు. రాముడు తన వాళ్లందరికీ తోడుగా ఉన్నడని కీర్తించారు. ఎవరినీ విడిచి పెట్టలేదు, ఎవరికీ దూరంగా ఉండలేదని చెప్పుకొచ్చారు. అయోధ్య రామ మందిర ప్రాంగణంతో పాటుగా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లో కూడా దీపాలను వెలిగించారు. ఇక ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐదు యానిమేటెడ్ టేబులాక్స్, వివిధ రాష్ట్రాల నుంచి నృత్య రూపాలను ప్రదర్శించే 11 రామ్లీలా టేబులాక్స్ కూడా దీపోత్సవంలో ప్రదర్శించారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదానికి శ్రీరాముడే స్పూర్తని ప్రధాని వివరించారు.