Ayodhya verdict: అయోధ్యపై తీర్పు: రంగంలో దిగిన చీఫ్ జస్టిస్: యూపీ ప్రభుత్వ, పోలీసు పెద్దలతో భేటీ..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలో తీర్పు వెలువరించనుంది. సోమవారం, మంగళవారాల్లో ఈ తీర్పు వెలువడటానికి అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ రంగంలోకి దిగారు. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావడం వల్ల తీర్పు వెలువడిన తరువాత దేశంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే విషయం ఆయన ఆరా తీస్తున్నారు.

సీజేఐ.. స్వయంగా..
ఇందులో భాగంగా- ఉత్తర్ ప్రదేశ్ పై ఆయన తన దృష్టిని కేంద్రీకరించారు. అయోధ్య భూవివాదం ఆ రాష్ట్రానికే చెందినది కావడం ఒక ఎత్తయితే.. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్ర కావడం మరో ఎత్తు. ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని రంజన్ గొగొయ్.. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్ తో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తీర్పు వెలువడటానికి ముందు. ఆ తరువాతి పరిస్థితులను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై ఆయన వారిని అడిగి తెలుసుకోనున్నారు.

భద్రతా బలగాల గుప్పిట్లో యూపీ..
ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలను పరిరక్షించడంపై ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే రంగంలోకి దిగడం.. ఆసక్తి రేపుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ పై నిఘా వేసిన విషయం తెలిసిందే. నాలుగు వేల మంది సాయుధ బలగాలను ఆ రాష్ట్రానికి పంపించింది. బీఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, ఎస్పీఎఫ్, ఇండో టిబెటన్ సరిహద్దు బలగాలను ఉత్తర్ ప్రదేశ్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరింపజేశారు ఆ శాఖ అధికారులు. ఉత్తర్ ప్రదేశ్ మొత్తం క్రమంగా భద్రతా బలగాల గుప్పిట్లోకి చేరుతోంది.

34 జిల్లాలు సమస్యాత్మకమైనవిగా..
ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 34 జిల్లాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు కూడా. ఆయా జిల్లాల్లో హై అలర్ట్ ను ప్రకటించారు. ఈ మేరకు ఆయా కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లకు అధికారికంగా లేఖలను రాసినట్లు చెప్పారు. దీనితో పాటు- 34 జిల్లాలను సమస్యాత్మకంగా గుర్తించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఆయా జిల్లాల్లో అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మీరట్, ఆగ్రా, అలీగఢ్, రామ్ పూర్, బరేలీ, ఫిరోజాబాద్, కాన్పూర్, లక్నో, షాజహాన్ పూర్, షామ్లీ, ముజప్ఫర్ నగర్, బులంద్ షహర్, ఆజంగఢ్ వంటి జిల్లాల్లో ఘర్షణలు చెలరేగడానికి అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. ఆయా జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వెంటనే అణచివేయడానికి చర్యలు తీసుకుంది.












Click it and Unblock the Notifications