Ayodhya verdict: ఆ అయోధ్యే ఇప్పుడు ఎలా ఉందంటే!
లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించిన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం మరి కొన్ని గంటల్లో తన తీర్పును వెలువరించబోతోంది. కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం, ఈ కేసుకు ఉన్న సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు అసాధారణ రీతిలో భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశాయి. అయోధ్యపై తీర్పు వెలువడబోతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రస్తుతం అందరి కళ్లూ శ్రీరామచంద్రుడు జన్మించిన నేల మీదే నిలిచాయి.
Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు
సర్వం.. పోలీసుల మయం
శనివారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించబోతున్న సమాచారం తెలిసిన వెంటనే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్యలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. కనీవినీ ఎరుగని రీతలో పోలీసులు అయోధ్యలో పహారా కాస్తున్నారు. ఈ తెల్లవారు జామున సామాన్య ప్రజలెవరూ రోడ్ల మీద కనపించలేదు. అత్యవసర కార్యక్రమాల నిమిత్తం బయటికి వెళ్లే వారు తప్ప సాధారణ రోజుల్లో ఉండే జన సంచారం లేదు. రోడ్ల మీద వచ్చిన వారికి పోలీసులు అడ్డగిస్తున్నారు. వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారు. విస్తృతంగా సోదాలను నిర్వహిస్తున్నారు.
ఆలయాలకు పటిష్ఠ భద్రత..
అయోధ్యలో సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాకుండా.. అన్ని చోట్ల కూడా పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయోధ్యలోని అన్ని ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలకు బందోబస్తును కల్పించారు. అయోధ్యలోని ప్రఖ్యాత, అతి ప్రాచీనమైన హనుమాన్ గర్చి ఆలయానికి రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారమైనప్పటికీ.. రోజువారీ పూజలను నిర్వహించే అర్చకులు, ఇతర అతి కొద్దిమంది భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశాన్ని కల్పించారు. భక్తుల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. ప్రాత:కాల పూజలను నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు.
డ్రోన్లతో పహారా..
దీనితో పాటు- అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత ప్రదేశానికి వెళ్లడానికి అధికారిక హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచారు. అయోధ్య సహా సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా భధ్రతను పర్యవేక్షించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయోధ్యలో రెండు దశల్లో డ్రోన్ల ద్వారా భద్రతా చర్యలను పరిశీలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇవే చర్యలను తీర్పు వెలువడిన తరువాత కూడా కొనసాగిస్తామని తెలిపారు. తీర్పు వెలువడబోయే రోజు యోగి ఆదిత్యనాథ్ సచివాలయంలోనే ఉండటానికి అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తీర్పు వెలువడటాకి ముందు, ఆ తరువాత అధికారిక పర్యటనల్నింటినీ రద్దు చేయొచ్చని అంటున్నారు.