బాబ్రీ కేసులో మరో మలుపు: మహంత్ భాస్కర్ కన్నుమూత..
బాబ్రీ మసీద్ వివాదంలో హిందువుల పక్షాన పోరాడుతున్న మహంత్ భాస్కర్ దాస్(89) గుండెపోటుతో కన్నుమూశారు. ఇదే కేసులో ముస్లింల పక్షాన పోరాడుతున్న హషీమ్ అన్సారీ(95) కూడా గతేడాది కన్నుమూశారు.
న్యూఢిల్లీ: బాబ్రీ మసీద్ వివాదంలో హిందువుల పక్షాన పోరాడుతున్న మహంత్ భాస్కర్ దాస్(89) గుండెపోటుతో కన్నుమూశారు. ఇదే కేసులో ముస్లింల పక్షాన పోరాడుతున్న హషీమ్ అన్సారీ(95) కూడా గతేడాది చనిపోవడంతో.. కేసుకు సంబంధించి తొలి కక్షిదారులు ఇద్దరు చనిపోయినట్లు అయింది.
మహంత్ భాస్కర్ దాస్, హషీమ్ అన్సారీ మరణాల నేపథ్యంలో.. వీరిద్దరికీ అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కేసును ముందుకు నడిపిస్తారని తెలుస్తోంది. కాగా, శుక్రవారం సాయంత్రం ఛాతినొప్పి రావడంతో మహంత్ భాస్కర్ దాస్ ను ఘజియాబాద్ లోని హర్ష హార్ట్ ఇనిస్టిట్యూట్ లో చేర్చారు.
ఛాతిలో నొప్పితో పాటు ఉదయం ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలయ్యాయి. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం అందుకు సహకరించలేదు.
ఇదిలా ఉంటే, వివాదాస్పద రామజన్మభూమి ప్రాంతంపై మహంత్ భాస్కర్ దాస్ తొలిసారి 1959లో కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్మోహి అఖాడా.. సరయూ నది తీరంలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంది.