మోడీ హవా లేదు: ఉద్ధవ్, ప్రీతమ్ 'రికార్డ్' విజయం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఐతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన మెజారిటీ మాత్రం రాలేదు. దీంతో పాత మిత్రపక్షాలైన బీజేపీ-శివసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఉహాగానాలు వెలువడుతున్నాయి.
ఇందులో భాగంగా మహారాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేసే పార్టీకే తమ మద్దతు ఉంటుందని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే స్పష్టం చేశారు. తమకు రాజకీయాలకన్నా రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోడీ హవా లేదని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఈ రెండు పార్టీల మధ్య చర్చలు మొదలయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, చెరో రెండున్నర ఏళ్లపాటు సీఎం పదవిని చేపడదామని బీజేపీకి శివసేన ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఆఫర్ పై సాయంత్రం జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు.
బీడ్ లోక్ సభ్ స్దానం నుంచి ప్రీతమ్ ముండే ఘనవిజయం
మహారాష్ట్ర బీల్ లోక్ సభ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో దివంగత గోపీనాతథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే (బీజేపీ)ఘన విజయం సాధించారు. ఆమె 6,96,321 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్దిపై గెలుపొందారు. ఈ లోక్ సభ స్దానానికి ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించారు.
అందరికీ నచ్చివారే సీఎం
ఇక అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తే హర్యానా ముఖ్యమంత్రి అవుతారని హర్యానా బీజేపీ అధ్యక్షుడు విజయ్ వారియా అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హర్యానాలో తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్దిని ఎంపిక చేస్తుందని, అతను అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి అయి ఉంటారని తెలిపారు.
ఆరోసారి గెలిచిన భాజపా సీనియర్ నేత ప్రకాశ్ మెహతా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్కోసర్ తూర్పు నియోజక వర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ మెహతా ఆరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రకాశ్ మెహతా తన ప్రత్యర్దులపై 40,141 ఓట్ల ఆధిక్యం సాధించారు.
రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్న కల్ రాజ్ మిశ్రా
మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రా స్పష్టం చేశారు. హర్యానాలో మంచి ఫలితాలు వచ్చాయని, ప్రజల తీర్పను శిరసావహిస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు విషయంపై సాయంత్రం జరగనున్న పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.