బెంగుళూరు బాంబు పేలుడు: రంగంలోకి ఎన్ఐఏ, ఉగ్రవాది మెహిదీని అరెస్టు చేయడం వల్లేనా..?
బెంగుళూరు: బెంగుళూరులో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం ఉన్నాతాధికారులతో ఉన్నతస్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్ సమీపంలోని చర్చి వీధిలో కోకోనట్ గ్రూప్ హోటల్ వెలుపల పాదచారుల మార్గంలో జరిగిన ఈ బాంబు పేలుడులో తమిళనాడుకు చెందిన మహిళ భవానీ దేవి (38) చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యుడు కార్తిక్ సహా, మరో ఇద్దరు గాయపడ్డారు.
పేలుడు జరిగిన తీరును పరిశీలించిన బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి... సిమీ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తక్కువ తీవ్రతతో కూడిన బాంబు కావడంతో పెద్ద ముప్పు తప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రచారకుడు మెహిదీ మస్రూర్ బిస్వాస్ను అరెస్టు చేసిన నేపథ్యంలో బాంబు పేలుడు సంభవించిందా? లేక కొత్త సంవత్సరపు వేడుకలకు భయం కలిగించాలనే కోణంలో ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా అనేది తెలియరాలేదు. నగరమంతటా రెడ్ అలర్ట్ విధించినట్లు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే బెంగళూరు వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఈడీ రకానికి చెందిన బాంబునే ఉగ్రవాదులు ఈ దాడికి వినియోగించారని ఆయన పేర్కొన్నారు. ఈ పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్, పహార్ గంజ్, సరోజిని నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. బెంగుళూరులో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కోల్కత్తా, ముంబై , హైదరాబాద్, పుణె నగరాల్లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు.
సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడిన హోం మంత్రి రాజ్నాథ్ సింగ్
బాంబు పేలుడు ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ కర్ణాటక సీఎంను ఫోన్లో సంప్రదించారు. సమస్యను ఎదుర్కొనడానికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ సంఘటనా స్థలాన్ని సందర్శించి పోలీసులనడిగి వివరాలు తెలుసుకున్నారు.
బెంగుళూరు బాంబు పేలుడు ఘటన కేసును అవసరమైతే ఎన్ఐఏకి అప్పగిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ అన్నారు. బాంబు పేలుడు ఘటనపై జాతీయ భద్రతా సలహాదారు, ఐబీ చీఫ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
బెంగుళూరులోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని కర్ణాటక ప్రభుత్వానికి రాజ్ నాథ్ సూచించారు. మరోవైపు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల దుశ్యర్యగా అభివర్ణించారు.