రేపటి నుంచి 4 రోజుల పాటు బ్యాంకు సేవలకు బ్రేక్-కారణం ఇదే..!
రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ మూతపడబోతున్నాయి. బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం భారతీయ బ్యాంకర్ల అసోసియేషన్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకుల ఆసోసియేషన్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే రేపు నాలుగో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు.

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవల్లో డిజిటల్ లావాదేవీలు, ఏటీఎంలు ఉండవు. నగదు డిపాజిట్లు, చెక్కు క్లియరెన్స్లు, రుణ ఆమోదాలు, బ్రాంచ్ ల కార్యకలాపాలు వంటివి ప్రభావితం కానున్నాయి. చెక్కుల క్లియరింగ్, నగదు లావాదేవీలు, చెల్లింపులు, అడ్వాన్సులు కూడా నిలిచిపోనున్నాయి. బ్యాంకు సంఘాలు ఏడాదికి పైగా వారానికి ఐదు రోజుల పని దినం కోసం ఒత్తిడి చేస్తున్నాయి.
అయితే బ్యాంకులు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సులు చేసినా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో సమ్మె చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ప్రజలు తమకు ఈ విషయంలో మద్దతు ఇవ్వాలని, ఏదైనా అసౌకర్యం కలిగితే సహకరించాలని కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications