ఈ సాయంత్రం టీవీ ముందుకు ప్రధాని మోదీ: భారీగా వరాలు?: గ్యాస్ సిలిండర్, పెట్రోల్?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల ముందుకు రానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో 140 మంది కోట్ల ప్రజలపై పలు వరాలను కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వంటగ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపును ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అలాగే దేశంలో 100 రూపాయలకు పైగా పలుకుతోన్న పెట్రోల్, డీజిల్ రేట్లపై భారీ ఊరట ఇస్తారని సమాచారం.

జీఎస్టీ 2.0 సంస్కరణల అమలుకు ఒక రోజు ముందు ఆయన దేశ ప్రజలకు ముందు వస్తోండటం కొత్త పన్ను సంస్కరణల గురించి ప్రధాని మాట్లాడే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ప్రసంగం గురించిన వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రసంగ సమయం ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.
చివరిసారిగా ఈ ఏడాది మే 12వ తేదీన ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' గురించి ఆ ప్రసంగంలో వివరించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక విషయాలను ఆయన అప్పుడు ప్రస్తావించారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా ప్రధాని మోదీ పలుమార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు మరోసారి ఆయన టీవీ ముందుకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో ఇదే దీపావళి సమయంలో దేశ ప్రజలకు భారీ ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే. పెట్రోల్, వంటగ్యాస్ పై భారీగా రేట్లను తగ్గించారు అప్పట్లో. ఈ మధ్యే జీఎస్టీ తగ్గింపునూ ప్రకటించారు. అది రేపటి నుంచి అమలులోకి రాబోతోంది. ఈ పరిస్థితుల్లో మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతోండటం చర్చనీయాంశమౌతోంది. మరోసారి తగ్గింపు ఉండొచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి. సాయంత్రం దీనిపై సస్పెన్స్ వీడిపోనుంది.












Click it and Unblock the Notifications