భార్యను కత్తితో పొడిచి టెక్కీ ఆత్మహత్యాయత్నం
బెంగళూరు: భార్యాభర్తల మధ్య రాజుకున్న గొడవ వారి ప్రాణాలకు మీదికి తెచ్చింది. భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి.. ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ తర్వాత అతను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన ఇరుగుపొరుగువారు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన గురువారం సాయంత్రం బెంగళూరులో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. థామ్సన్ రూటర్స్ సంస్థలో సాఫ్ట్వేర్ విభాగంలో మేనేజర్ విధులు నిర్వహిస్తున్న అరబిందో(45), సుమితా దేవి(37) భార్యాభర్తలు. కోల్కతాకు చెందిన వీరు బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని కోదిహల్లి ఫ్లాట్లో నివాసముంటున్నారు.
గురువారం సాయంత్రం వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అరబిందో భార్య సుమితపై కత్తితో దాడి శాడు. రెండు మూడుసార్లు కత్తితో పొడిచేయడంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆందోళనకు గురైన అరబిందో తాను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
కాగా, ఈ సమయంలో వారి 8ఏళ్ల కూతురు పాఠశాలలో ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ దంపతులు రెండు మూడు రోజులుగా గొడవపడుతున్నారని, గురువారం తీవ్ర రూపం దాల్చడంతో భార్యను చంపేందుకు అరబిందో ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పారు. అరబిందో, సుమితాల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని, వారు త్వరలోనే బెంగళూరు చేరుకుంటారని పోలీసులు తెలిపారు.