పంజాబ్ పసుపుమయం: ఆమ్ఆద్మీ చరిత్రలో కొత్త అధ్యాయం: ప్రమాణ స్వీకారానికి మాజీ భార్య
చండీగఢ్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి ఇవ్వాళ తెర లేవనుంది. ఢిల్లీకి మాత్రమే పరిమితమైందనుకున్న ఈ పార్టీ- తన పరిధి విజయవంతంగా విస్తరించుకోగలిగింది. పొరుగునే ఉన్న పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలవనుంది. వరుసగా రెండుసార్లు ఢిల్లీని తిరుగులేని మెజారిటీతో గెలిచిన అరవింద్ కేజ్రీవాల్.. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్కు మొన్నటి ఎన్నికల్లో చుక్కలు చూపించారు.
మొన్నటి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో- పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ను మట్టి కరిపించిందీ పార్టీ. 117 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 92 స్థానాలపై జెండా పాతింది. కాంగ్రెస్-18 సీట్లకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్, బీజేపీ అడ్రస్ గల్లంతయింది. ఈ రెండు పార్టీలకు దక్కిన స్థానాలు అయిదు మాత్రమే. నాలుగు రాష్ట్రాల్లో కనిపించిన బీజేపీ ప్రభంజనం ఇక్కడ మాత్రం మటుమాయమైంది.
ఈ విజయోత్సాహంతో ఆమ్ ఆద్మీ పార్టీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణం చేస్తారు. షహీద్ భగత్ సింగ్ స్వస్థలం ఖట్కర్ కలాన్లో.. ప్రజల మధ్య భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్- ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి కనీసం మూడు లక్షల మంది హాజరవుతారని ఆప్ అంచనా వేసింది. దీనికి హాజరయ్యే పురుషులు పసుపురంగు పగిడీలు, మహిళలు అదే రంగు చున్నీలను ధరించాలని ఇదివరకే భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ పసుపు రంగు పగిడీలతో కనిపిస్తున్నారు.
Recommended Video
భగవంత్ మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన కుమార్తెలు సీరత్ కౌర్ మన్నా, దిల్షన్ మన్నా హాజరు కానున్నారు. అమెరికాలో నివసిస్తోన్న వారిద్దరూ పంజాబ్కు చేరుకున్నారు. భగవంత్ మాన్ మాజీ భార్య ఇందర్జిత్ కౌర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. 2015లో భగవంత్-ఇందర్జిత్ కౌర్ విడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భగవంత్ మాన్ కోసం ఇందర్జిత్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ మరుసటి ఏడాదే వారు వేరు పడ్డారు.