భవానీపూర్ బైపోల్: స్మృతీ ఇరానీ, బాబూల్ సుప్రియోతోపాటు 20 మంది స్టార్ క్యాంపేనర్లు వీరే
కోల్కతా: దేశ వ్యాప్తంగా ఇప్పుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న భవానీపూర్ ఉపఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ ఉపఎన్నికలో పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. కాగా, మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. మమతకు గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రియాంకను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భవానీపూర్ ఉపఎన్నికలో ప్రచారం నిర్వహించేందుకు 20 మంది స్టార్ క్యాంపేనర్లను ప్రకటించింది బీజేపీ. ఇందులో నలుగురు మినహా మిగితావారంతా పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినవారే ఉండటం గమనార్హం. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్, ఎంపీ మనోజ్ తివారీ మాత్రమే ఔట్ సైడర్స్ ఉన్నారు.

మిగితావారిలో..
దిలీప్ ఘోష్, ఎంపీ, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు
సువేందు అధికారి, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు
అమితవ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి (సంస్థ), పశ్చిమ బెంగాల్ బీజేపీ
రాహుల్ సిన్హా, బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి
స్వపన్ దాస్ గుప్తా, రాజ్యసభ ఎంపీ
అనిర్బన్ గంగూలీ, ఎస్పీఎంఆర్ఎఫ్ డైరెక్టర్
దేబశ్రీ చౌదరి, ఎంపీ
బాబుల్ సుప్రియో, ఎంపీ
సుభాష్ సర్కార్, కేంద్ర మంత్రి
జాన్ బార్లా, కేంద్ర మంత్రి
సమీక్ భట్టాచార్య, బెంగాల్ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి
రూప గంగూలి, రాజ్యసభ ఎంపీ
అగ్నిమిత్ర పాల్, ఎమ్మెల్యే, బీజేపీ మహిళా మోర్చా చీఫ్
శంతను ఠాకూర్, కేంద్ర మంత్రి
లాకెట్ ఛటర్జీ, బెంగాల్ ఎంపీ
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్
దినేష్ త్రివేది, మాజీ కేంద్ర మంత్రి
మనోజ్ తివారీ, ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్
హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర మంత్రి
స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
ప్రియాంక టిబ్రేవాల్ ఎవరంటే..
కాగా, మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు లీగల్ అడ్వైజర్గా ఉన్న ప్రియాంక టిబ్రేవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంతో స్ఫూర్తి పొంది ఆగస్టు 2014లో బీజేపీలో చేరారు. 2015లో కోల్కతా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ తరపున వార్డు నెంబర్ 58(ఎంటల్లీ) నుంచి పోటీ చేసిన ఆమె.. టీఎంసీ అభ్యర్థి స్వపన్ సమ్మదర్ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఆరేళ్లలో ప్రియాంక పశ్చిమబెంగాల్ బీజేపీలో కీలక పదవుల్లో పనిచేశారు. పశ్చిమబెంగాల్ భారతీయ జనతా యువజన(బీజేవైఎం) ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నుంచి పోటీ చేసిన ప్రియాంక.. టీఎంసీ అభ్యర్తి స్వర్ణ కమల్ సాహా చేతిలో 58,257 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
1981, జులై 7న కోల్కతాలో జన్మించారు ప్రియాంక టిబ్రేవాల్. వెల్లాండ్ గౌల్డ్ స్మిత్ స్కూల్ లో విద్యనభ్యసించిన ప్రియాంక.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. హజ్రా లా కాలేజీలో లా డిగ్రీని పూర్తి చేశారు. థాయిలాండ్ అజ్యుంప్షన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
భవానీపూర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారా? అని తనను బీజేపీ నాయకత్వం తన అభిప్రాయాన్ని కోరిందని ప్రియాంక టిబ్రేవాల్ తెలిపారు. తనతోపాటు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయని, అయితే, ఎవరు పోటీ చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని చెప్పారు. ఇప్పటి వరకు తనకు సీనియర్ నాయకులు ఎంతో సహకారం అందించారని తెలిపారు. ఒక వేళ తనను భవానీపూర్ నుంచి పార్టీ నాయకత్వం పోటీ చేయాలని నిర్ణయిస్తే.. తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రియాంక టిబ్రేవాల్ తెలిపారు.
ప్రజల ఆశీస్సులతో తన ప్రయత్నం చేస్తానని అన్నారు. ఇది న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటంలో ప్రజలు తనవైపున నిలబడతారని భావిస్తున్నట్లు చెప్పారు. టీఎంసీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, బెంగాల్ ప్రజల బాధలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు.
'నేను ప్రధాని నరేంద్ర మోడీ దూతను. బీజేపీకి ఓటేయాలని భవానీపూర్ ప్రజలను కోరుతున్నా. మోడీజీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడ కూడా బీజేపీని గెలిస్తే బెంగాల్ కూడా మరింత అభివృద్ధి సాధిస్తుంది' అని ప్రియాంక టిబ్రేవాల్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితానికి మార్గదర్శిగా ఉన్న సుప్రియోకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసకు నేను వ్యతిరేకంగా నిలబడ్డాను.
పలు కేసులు కోర్టులో ఉన్నాయి. ఎంటల్లీలో దాడులకు భయపడి వెళ్లిపోయిన బీజేపీ కార్యకర్తలను తిరిగి వచ్చేందుకు సాయం చేశాను. టీఎంసీ గూండాల దాడులకు భయపడి బీజేపీ కార్యకర్తలు తమ నివాసాలను వదిలి వెళ్లిపోయారు. ఇప్పటికైనా టీఎంసీ హింసాత్మక రాజకీయాలకు ముగింపు పలకాలి అని ప్రియాంక టిబ్రేవాల్ వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు. భవానీపూర్ ప్రజలు ఈ అరాచక టీఎంసీని ఓడించి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయలన్నారు. మమతా బెనర్జీ అధికారం కోసం ఎన్ని దారుణాలకైనా తెగబడతారని అన్నారు.












Click it and Unblock the Notifications