పెద్ద పార్టీలు మమ్మల్ని అంటరానివారన్నారు .. బీహారీలు 5 స్థానాలిచ్చారు : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
బీహార్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీకి ఐదు స్థానాలను కట్టబెట్టారు బీహారీలు. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ విజయం సాధించడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. 2019లో ఐదు స్థానాల్లో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగింది. ఈ క్రమంలో బీహార్ ప్రజలు ఆదరించటంపై హర్షం వ్యక్తం చేసిన ఓవైసీ పెద్ద పార్టీలు తమను అంటరాని వారిగా చూశారని, కానీ బీహారీలు తమను బాగా ఆదరించారని పేర్కొన్నారు.
మమ్మల్ని అంటరానివారిగా చూశారు .. ఏ పార్టీ తమతో కలిసి రాలేదు
మాతో కలిసి పోటీ చేయడానికి జాతీయ పార్టీలు ముందుకు రాలేదన్న ఓవైసీ, మమ్మల్ని అంటరానివారిగా చూశారు .. ఏ పార్టీ తమతో కలిసి రాలేదన్నారు . అయినా ఈ ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని తాను ముందే ఊహించాను అంటూ పేర్కొన్నారు. ఇది తమ రాజకీయ పార్టీకి చాలా మంచి రోజని, బీహార్ ప్రజలు ఓటేసి ఆశీర్వదించారని, వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తనకు తెలియడం లేదంటూ ఓవైసీ పేర్కొన్నారు. తాము ప్రజల కోసం పని చేస్తామని, వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై పని చేస్తామన్న ఓవైసీ
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ప్రజలు బయటకు వచ్చి తమకు ఓటు వేసి నందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇంకా ఎక్కడో లోపం జరగడం వల్లే తాము ఎక్కువ సీట్లు గెలవలేక పోయాము అని, ప్రజా సమస్యలపై పనిచేసి ముందు ముందు బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని ఓవైసీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మినహాయించి ఎంఐఎం ఇతర ప్రాంతాలలో ఎక్కడ పోటీ చేసినా బీజేపీకి లాభం చేకూరుస్తుందని ఒక నానుడి. ఈ క్రమంలో బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం కీలక పాత్ర పోషించి మహా కూటమి ఓటమికి కారణమైంది. తాము బీజేపీని వ్యతిరేకిస్తున్నాం అంటూనే ఎంఐఎం పోటీ చెయ్యటం బీజేపీకి అధికారం కట్టబెట్టింది.
Recommended Video
ఆర్జేడీకి తీరని నష్టం చేసిన ఎంఐఎం
ముఖ్యంగా ఆర్జెడి ప్రధాన ఓటు బ్యాంక్ అయిన యాదవులు, ముస్లిం ఓటు బ్యాంకులో, ముస్లింల ఓట్లను చీల్చడానికి ఎంఐఎం కీలకంగా పని చేసింది. ఆర్జెడి ఓటమికి కారణమైంది. ఇక ఎక్కడ పోటీ చేసిన ఓటు కట్టర్ అని పిలిచే రాజకీయ పార్టీలకు బీహార్ లో ఐదు స్థానాలు గెలిచి గట్టిగా సమాధానం చెప్పామని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. బీహార్ రాజకీయాల్లో హంగ్ ఏర్పడితే ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని భావించారు. కానీ బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కు పట్టం కట్టాయి. ఓ రకంగా చెప్పాలంటే ఎన్డీఏ విజయానికి ఎంఐఎం ఆర్జెడి ఓట్ బ్యాంక్ చీల్చడం కీలకంగా మారింది. బీహార్ లో ఆర్జేడీ కూటమి ఓటమి పాలయ్యిందని వారు తమ నిరాశను దాచడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న ఓవైసీ వారు ఓడిపోతే వారు ఓవైసీని నిందించారని చెప్పారు . తాము ఐదేళ్ల క్రితం బీహార్లో పార్టీ ప్రయాణాన్ని ప్రారంభించామని . మేము సీమాంచల్ అభివృద్ధి కోసం కృషి చేసామని చెప్పారు.