బిగ్ రిలీఫ్: పల్స్ ఆక్సీమీటర్ తోపాటు 5 మెడికల్ డివైజ్ల ధరలు 88 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ వేవ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు అంచనాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల చికిత్సలో కీలకంగా మారిన పల్స్ ఆక్సీమీటర్, నెబ్యూలైజర్ వంటి 5 రకాల వైద్య పరికరాల ధరలు ఏకంగా 88 శాతం తగ్గించింది. ఈ మేరకు రసాయనాలు, ఎరువుల శాఖ వెల్లడించింది.
కరోనా బాధితుల శ్వాస, చక్కెర శాతం, రక్తపోటు, జ్వరం పరీక్షించేందుకు ఉపయోగించే పల్స్ ఆక్సీమీటర్, గ్లూకో మీటర్, బీపీ మానిటర్, డిజిటల్ థర్మామీటర్ తోపాటు శ్వాస సంబంధ సమస్యలు పరిష్కరించేందుకు వినియోగించే నెబ్యూలైజర్ ధరలు కూడా గణనీయంగా పెంచి విక్రయించారు.
ఈ నేపథ్యంలో వీటిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ట్రేడ్ మార్జిన్ను గరిష్టంగా 70 శాతానికి పరిమితం చేస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అఠారిటీ ఆంక్షలు విధించడంతో జులై 20 నుంచి ఈ వైద్య పరికరాల(పల్స్ ఆక్సీమీటర్, గ్లూకో మీటర్, బీపీ మానిటర్, డిజిటల్ థర్మామీటర్, నెబ్యూలైజర్) ధరలు భారీగా తగ్గాయని పేర్కొంది.

జులై 23, 2021 నాటికి 684 బ్రాండ్ల వైద్య పరికరాలు నమోదు కాగా, 620(91శాతం) పరికరాల ఎంఆర్పీ ధరలను ఆయా సంస్థలు సవరించాయి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్లకు అందించే ధర, ఎంఆర్పీ మధ్య 709 శాతం వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. దీన్ని తాజాగా, 10 రేట్లకుపైగా తగ్గించారు.
కాగా, దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,742 కొత్త కేసులు నమోదు కాగా, 535 మరణాలు చోటు చేసుకున్నాయి. తాజా మరణాలతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 4,20,551కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,08,212 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవారి సంఖ్య 43,31,50,864కి చేరింది.












Click it and Unblock the Notifications