న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఆమోదం
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్తగా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. న్యాయమూర్తుల నియామకం, బదలీల వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది.
ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మోడీ ప్రభుత్వానికి పెద్ద విజయమని చెప్పవచ్చు.
ఈ బిల్లు నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు కానుంది. దేశంలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల వ్యవహారాలను ఈ కమిటీయే చూస్తుంది. ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో ఈ కమిటీ కొత్తగా ఏర్పాటవుతోంది.
న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ కొన్ని రోజుల కిందట ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్, జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇందుకు మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని తీసుకొస్తోంది.
ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే, రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బిల్లులో కాంగ్రెస్ పార్టీ కొన్ని సవరణలు డిమాండ్ చేసే అవకాశముంది.