పిడుగుల బీభత్సం: 83 మంది మృతి, ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం పెను బీభత్సాన్ని సృష్టించింది. రాష్ట్రంలో గురువారం కురిసిన పిడుగులవానతో ఏకంగా 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడంతో పెను విషాదం నెలకొంది.
Recommended Video
ఒక్క గోపాల్ గంజ్ జిల్లాలోనే 13 మంది మృతి చెందినట్లు బీహార్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు బాలురు ఉన్నారు.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ క్రమంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. చెట్ల కింద నిలబడవద్దన్నారు.

వ్యవసాయ క్షేత్రాల్లో పనుల్లో నిమగ్నమై ఉండగా కురిసిన పిడుగుపాటుకు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటుతో 83 మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
భారత వాతావరణ శాఖ కూడా బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో బిహార్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశానికి ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, అస్సాం రాష్ట్రంలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలకు తిన్సుకియా బాగ్ఘాన్ లో ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది.












Click it and Unblock the Notifications