ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలకు బీజేపీ అండ....త్వరలో తీన్ తలాక్ ప్రముఖ్స్ నియామకం
ఉత్తర్ ప్రదేశ్ : ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలను బీజేపీ ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రిపుల్ తలాక్ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్లోని యోగీ సర్కార్. ట్రిపుల్ తలాక్పై ముస్లిం మహిళల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు దీనివల్ల కలిగే నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తోంది యోగీ సర్కార్. ఇందుకోసం తీన్ తలాక్ ప్రముఖ్స్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 100 మంది మహిళలను నియమించనుంది.
ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలకు బాసటగా యోగీ సర్కార్
ట్రిపుల్ తలాక్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ యోగీ సర్కార్ ఎన్నికల వేళ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ సారి ట్రిపుల్ తలాక్ బారిన పడి ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలకు బాసటగా నిలిచేందుకు యోగీ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా తీన్ తలాక్ ప్రముఖ్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మహిళలను నియమిస్తోంది. వారంతా ట్రిపుల్ తలాక్ బారిన పడ్డ ముస్లిం మహిళలను వారి పిల్లలను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అంతేకాదు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ట్రిపుల్ తలాక్ బారిన పడ్డారో డిసెంబరులో సర్వే చేయించనుంది యూపీ సర్కార్.
ఎన్నికల వేళ బీజేపీ నిర్ణయం భేష్
ఇక 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అడుగు కచ్చితంగా బీజేపీకి వర్కౌట్ అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పురుషుల కంటే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళలే ఎక్కువగా బీజేపీకి ఓటువేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా కార్యదర్శి నజియా ఆలం ఈ తీన్ తలాక్ ప్రముఖ్స్కు నేతృత్వం వహిస్తారు. షరియత్ చట్టాలపై అవగాహన కలిగి ఉండి బాధితుల్లో సామాజిక మార్పు తీసుకురాగలిగే సత్తా ఉన్న వారినే ప్రముఖ్స్గా నియమించడం జరుగుతుందని నజియా ఆలం తెలిపారు.
ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలు ఎంతమంది ఉన్నారనేదానిపై సర్వే
తీన్ తలాక్ ప్రముఖ్స్ నియమించడం బీజేపీ తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ నిర్ణయం కేవలం ఎన్నికల వరకే పరిమితం కాకూడదని వారు చెబుతున్నారు. విడాకులు తీసుకుని పిల్లలను పోషించుకుంటున్న బాధిత మహిళలకు అండగా నిలవాలని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రముఖ్స్ నియామకాలు డిసెంబర్ నెలలో జరిగే సర్వే తర్వాత ఉంటుందని నజియా ఆలం వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరు కల్లా ప్రతి జిల్లాలో ఉన్న ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలను గుర్తించి వారికి అందించాల్సిన సహాయ సహకారాలన్నీ చేస్తామని ఆలం చెప్పారు. దీపావళి పండగ అయ్యాక దీనిపై దృష్టి కేంద్రీకరిస్తామని వెల్లడించారు. అంతేకాదు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కిందకు ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలను చేర్చే విషయమై కూడా ఆలోచిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ పథకం ద్వారా యువతకు పలు పరిశ్రమల్లో నైపుణ్యతపై శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై సొంతంగా నిలబడేలా చేసి మంచి జీవనోపాధిని కల్పించడం జరుగుతుంది.