లోక్ సభ ఎన్నికల్లో దున్ని పారేసి.. అసెంబ్లీ బరిలో చతికిల పడ్డ కమలనాథులు: ఎందుకిలా?
రాంచీ: అదే జార్ఖండ్.. సరిగ్గా ఆరు నెలల కిందట భారతీయ జనతా పార్టీ పరిస్థితి వేరుగా ఉండేది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సంకీర్ణ కూటమిని మట్టి కరిపించిన జోష్ కమల నాథుల్లో ఉవ్వెత్తున ఎగిసి పడింది. కాంగ్రెస్ పార్టీని ఖాతా తెరవనీయకుండా చేసిన ఉత్సాహం కాషాయ పార్టీ ఉరకలు వేసింది. కాంగ్రెస్ మిత్ర పక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను కేవలం రెండు స్థానాలకే పరిమతం చేసిన ఘనత బీజేపీలో అణువణువునా నెలకొంది. ఇక- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేదని రొమ్ము విరుచుకుని నిల్చున్నారు బీజేపీ నేతలు.
రాజపూజ్యం-1, అవమానం-5: 12 నెలల్లో అయిదు రాష్ట్రాలను కోల్పోయిన కమలం..!
ఆరునెలల్లో ఫలితాలు తారుమారు..
అదే జార్ఖండ్.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉండొచ్చు. వరుసగా రెండోసారి మరో అయిదేళ్ల పాటు పరిపాలించాల్సిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నామనే విషాదం బీజేపీ నేతల్లో వ్యక్తమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో కనిపించిన ఫలితాలే అసెంబ్లీ బరిలోనూ పునావృతమౌతాయని భావించిన కమలనాథుల ఆశలపై నీళ్లు చల్లారు జార్ఖండ్ ఓటర్లు. ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేశారు. జార్ఖండ్ ఓటర్ల దెబ్బకు బీజేపీ ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సిన పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
12 లోక్ సభ స్థానాలను కొల్లగొట్టిన కమలం..
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 12 స్థానాలను కొల్లగొట్టింది బీజేపీ. జార్ఖండ్ లో మొత్తం 14 లోక్ సభ సీట్లు ఉండగా..11 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పట్లో బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించిన అఖిల జార్ఖండ్ విద్యార్థి యూనియన్ (ఏజెఎస్యూ) ఒక సీటును కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అస్సలు ఖాతానే తెరవ లేకపోయింది. కాంగ్రెస్ తో సీట్లను సర్దుబాటు చేసుకున్న జార్ఖండ్ ముక్తి మోర్చా రెండింటింకే పరిమితమైంది. జేఎంఎం అధినేత శిబూ సోరెన్ సైతం ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ఆరు నెలలు తిరిగే సరికి..
సరిగ్గా ఆరు నెలలు తిరిగే సరికి ఓడలు బండ్లు అయ్యాయి.. బండ్లు ఓడలు అయ్యాయి. 14 లోక్ సభ స్థానాలకు 12 చోట్ల దున్ని పారేసిన కమలనాథులు అసెంబ్లీ ఎన్నికల బరిలో చతికిల పడ్డారు. కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ కూటమిని ఢీ కొట్టలేకపోయింది. లోక్ సభ నాటి జోష్ ను పునరావృతం చేయడంలో విఫలమైంది. నిజానికి- లోక్ సభ స్థానాల ఫలితాలే గనక అసెంబ్లీ పోలింగ్ మీద ప్రతిబింబించి ఉంటే.. బీజేపీ తిరుగులేని మెజారిటీని సాధించి ఉండేది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని ఉండేది.
స్థానిక అంశాలే కీలకంగా
లోక్ సభ ఎన్నికలకు ఓ రకంగా.. అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఇంకో రకంగా విభిన్న తీర్పును ఇచ్చారు జార్ఖండ్ ప్రజలు. జాతీయ అంశాలు, స్థానిక విషయాలను వేరుగా చూశారు. వాటికి తగ్గట్టుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనేది ఇక్కడ స్పష్టమౌతోంది. స్థానిక అంశాలను పరిష్కరించడం వైపే వారు మొగ్గు చూపారు. వాటిని పరిష్కరించలేకపోవడం వల్లే రఘుబర్ దాస్ ప్రభుత్వాన్ని జార్ఖండ్ ఓటర్లు గద్దె దింపారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఫలితం ఇవ్వని ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం..
ఓ రకంగా చెప్పాలంటే జార్ఖండ్ గిరిజన రాష్ట్రం. గిరిజనులు, ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉండే ఓ చిన్న రాష్ట్రం అది. అటవీ ప్రాంతం అధికంగా ఉండే రాష్ట్రాల్లో జార్ఖండ్ తొలి అయిదు స్థానాల్లో ఉంటుంది. అలాంటి చోట ఆర్టికల్ 370ని రద్దు చేయడం, రామ మందిర నిర్మాణం, అయోధ్య భూవివాద పరిష్కారం.. వంటి జాతీయ స్థాయి అంశాలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయనేది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్ ను చూస్తే ఇట్టే అర్థమౌతుంది. స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనకే జార్ఖండ్ ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చారనడంలో సందేహాలు అక్కర్లేదనే అనుకోవచ్చు.