పశ్చిమ యూపీలో బీజేపీకి కష్టాలు తప్పవా?
ఉత్తరప్రదేశ్లోని బాదాయున్ ప్రాంతంలోని బార్ఖెడా గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్సేవక్ పటేల్కు బదులు పార్టీ నాయకత్వం ‘బయటి వ్యక్తి’ ప్లస్ వ్యాపార వేత్త మహేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బాదాయున్ ప్రాంతంలోని బార్ఖెడా గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్సేవక్ పటేల్కు బదులు పార్టీ నాయకత్వం 'బయటి వ్యక్తి' ప్లస్ వ్యాపార వేత్త మహేశ్ గుప్తాకు టిక్కెట్ ఇచ్చినందుకు నిరసనగా ఆందోళన చేశారు. ఠాకూర్ల ఆధిపత్యంలో గల ఈ గ్రామంలోని వాల్మికీలు, మౌర్యలు, ముస్లింలు ఆందోళనలో భాగస్వాములయ్యారు.
'రామ్ సేవక్ జీ' స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని స్థానికులు చెప్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకత్వం కూడా రామ్ సేవక్ పటేల్ అభ్యర్థిత్వానికే మద్దతు పలికినా బిజెపి నాయకత్వం అందుకు అంగీకరించలేదు. దీనిపై భవిష్యత్ కార్యాచరణ విషయమై చర్చించేందుకు గ్రామస్తులంతా సమావేశం అయినప్పుడు తాము టిక్కెట్ ఇస్తామని శివసేన ఆఫర్ ఇవ్వడంతో సంతోషంలో మునిగి పోయామని అంటున్నారు.
కుర్మీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రామ్ సేవక్ పటేల్.. సంప్రదాయంగా బిజెపి మద్దతుదారులే. బాదాయున్ పొరుగు అసెంబ్లీ సెగ్మెంట్ షేఖుపూర్ స్థానంలోని కుర్మీలూ బిజెపికి వ్యతిరేకంగా ఓటేస్తారని ఆ సామాజిక వర్గానికి చెందిన నేత సత్బీర్ సింగ్ తెలిపారు.
కొత్తవారికి టిక్కెట్లు.. పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత
బదాయున్ మాదిరిగానే కొనార్ గ్రామంలో అత్యధిక ఓటర్లు జాతవ్లు. సహజ సిద్ధంగా జాతవ్లంతా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి మద్దతుదారులు. ఈ గ్రామంలో ఖాటిక్లు, దోబీలు తదితర దళిత సామాజిక వర్గం వారు ఉన్నారు. వారంతా సంప్రదాయంగా బిజెపికి మద్దతుదారులు. ఇదే గ్రామానికి చెందిన కుర్మీల నేత నరేశ్ సింగ్ పటేల్ కూడా ఈ దఫా బిజెపి టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో శివసేన తరఫున బరిలోకి దిగుతున్నారు. 'సర్వే ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపికచేస్తామని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా హామీని ఇచ్చారు. కానీ అలా జరుగలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సాధించడం పార్టీ నాయకత్వం కోరుకోవడం లేదు' అని నరేశ్ సింగ్ పటేల్ మండిపడ్డారు. 'మోడీ బెలూన్ పంక్చర్ కావడం ఖాయం' అని స్పష్టం చేశారు.
మిలీయనీర్లకు బీజేపీ చాన్స్
యావత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ అంతటా యువ వారసులు, బయటి వ్యక్తుల కథనాలే కనిపిస్తాయి.. వినిపిస్తాయి. హర్యానాకు చెందిన గుజ్జర్ మిలియనీర్ అవతార్ సింగ్ బదానాకు ఫరీదాబాద్ అసెంబ్లీ స్థానం దక్కింది. ఇందుకు నిరసనగా స్థానికులు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు తీవ్ర నిరసన తెలిపారు. ప్రస్తుతం నిరసన తెలియజేస్తున్న పార్టీ శ్రేణులతో పార్టీ నాయకత్వానికి అవసరం లేదని వారంటున్నారు. 2014 ఎన్నికల్లో మాదిరిగా హిందు - ముస్లింల మధ్య పునరేకీకరణ వల్ల బిజెపి విజయం సాధించగలిగిందన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయ్యాయని బిజెపి శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సైన్యం లక్షిత దాడులు, నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది. కీలక మద్దతుదారులైన అగ్రకులాలు, వెనుకబడిన కులాల మధ్య ఘర్షణ తలెత్తింది.
ఆర్ఎల్డికి జాట్ల బాసట
ముజఫర్నగర్ జిల్లాలోని బుధానాలో భారీ సంఖ్యలో జాట్ రైతుల కుటుంబాలు తొలి నుంచి బిజెపికి మద్దతుదారులు. కానీ వారంతా ప్రస్తుతం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ గాయపడ్డారని, రైతులు పూర్తిగా దెబ్బ తిన్నారని బల్బీర్ సింగ్ అనే రైతు తెలిపారు. తామంతా అజిత్ సింగ్ సారథ్యంలో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ (ఆర్ఎల్డి)కి ఓటు వేస్తామని చెప్పారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ జిల్లాల్లోని కోర్టుల్లో అగ్రకులాల న్యాయవాదులు విడిపోయారు, వారిలో కుల్ భూషణ్ షాత్మ, బ్రహ్మణులు ఉన్నారు. బీజేపీ క్రమంగా క్షీణిస్తోంది' అని బల్బీర్ సింగ్ అనే రైతు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ వైద్య వ్యాఖ్యలతో మారిన రాజకీయం
గత లోక్సభ ఎన్నికల సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు బిజెపి అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కష్ట పడ్డారు. రిజర్వేషన్లకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉన్నదని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య వివాదాస్పద ప్రకటన తర్వాత బరేలీలోని కమల్ పుర్వార్లు తమ వైఖరి మార్చుకున్నారు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనతో బీహార్ రాష్ట్రంలో బీజేపీ మద్దతుదారులుగా ఉన్న ఎంబీసీలు దూరమయ్యారు.
హిందుత్వ ఎజెండాతో మరింత నష్టం
దీనికితోడు అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని, తమ ఎజెండాలోనే ఉన్నదని బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య మొదలు గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యానాథ్ వరకు తమ ఎజెండాలో రామ మందిరం అంశం ఉందన్న ప్రకటన ద్వారా రాజకీయ పునరేకీకరణకు తెర తీశారు. మరోవైపు ఎన్నికల తర్వాత ట్రిపుల్ తలాఖ్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన ఈ కోవలోకే వస్తుంది. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు, దళితులను ఏకంచేయాలని బిజెపి వ్యూహంగా కనిపిస్తున్నది. గోరక్షకుల పేరిట గుజరాత్ రాష్ట్రంలోని దళితులపై దాడులు చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయిన సంగతిని కమలనాథులు విస్మరిస్తున్నారు.