ఎత్తుకున్నారు: అద్వానీ గురించి చెప్తూ మోడీ కంటతడి
న్యూఢిల్లీ: కాబోయే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మంగళవారం మధ్యాహ్నం ప్రసంగించారు. మోడీని బిజెపి పార్లమెంటరీ బోర్డు లోకసభలో పార్టీ నేతగా ఎన్నుకున్నాయి. అనంతరం మోడీ మాట్లాడారు. అద్వానీ, రాజ్నాథ్ సింగ్ల ఆశీర్వాద బలమే తనను ఇక్కడ కూర్చోబెట్టిందని చెప్పారు. కర్తవ్య దీక్ష, జవాబుదారీతనం తన ముందున్న అతి పెద్ద బాధ్యతలు అన్నారు. వందకోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు తన కళ్ల ముందే ఉన్నాయన్నారు.
తన శరీరంలోని ప్రతి అణువు పార్టీ లక్ష్యం కోసం పరితపించిందన్నారు. 2013 సెప్టెంబర్ నుండి అదే లక్ష్యంతో చిత్తశుద్ధితో తాను పని చేశానని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అదే లక్శ్యంతో పని చేశానని చెప్పారు. లక్ష్యం సాధించే దిశలో తాను ఓ సామాన్య కార్యకర్తలా పని చేశానని వ్యాఖ్యానించారు.
ఎవరికైనా బాధ్యత ముఖ్యమని, పదవులు ముఖ్యం కాదన్నారు.ఈ ఎన్నికలకు ముందు బిజెపి జయాపజయాల పైన ఎంతో చర్చ జరిగిందన్నారు. విచక్షణ కలిగిన భారత ప్రజలు సరైన సమాధానం చెప్పారన్నారు. తమ గెలుపును యువత, మహిళలు.. ఇలా అందరికీ అంకితమిస్తున్నామని చెప్పారు. ప్రజల స్వప్నాలను నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు. భారత మాతకు సేవ చేసే వరాన్ని తనకు ఆ దేవుడు, బిజెపి ఇచ్చిందన్నారు. బిజెపి దయవల్లే భారతమాతకు సేవ చేసే అదృష్టం దక్కిందన్నారు.
భావోద్వేగానికి గురైన మోడీ
ప్రసంగం మధ్యలో నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. అద్వానీ గురించి మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టారు. ఆ సమయంలో పలువురు ఎంపీలు కూడా కంటతడి పెట్టారు. స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాల నుండి మంచిని తీసుకుంటానని చెప్పారు. బిజెపికి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారంటే ప్రజలకు తమ మీద ఉన్న నమ్మకమే అన్నారు. వారి కలలను నిజం చేస్తామన్నారు.
ఈ కొత్త ప్రభుత్వాన్ని పేదవారికి అంకితమిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరుస్తారని తమ పైన ఆశలు పెట్టుకున్నారన్నారు. మార్పు కోసం యావత్ భారత దేశం కదిలిందన్నారు. గుజరాత్లో గతంలో భారీ భూకంపం వచ్చినప్పుడు ఆ రాష్ట్రం పని అయిపోయిందని అందరు అనుకున్నారని, కానీ నిలబడిందన్నారు.
ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి కణం దేశం కోసమే పరితపిస్తోందన్నారు. తాము అందరి అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. 2019లో తాను మరోసారి తన పని తీరుతో మీ మందుకు వస్తానని చెప్పారు. తాను ఎప్పుడో నిరాశను వదిలేశానని చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించాలంటే ఆశావాదమే ముఖ్యమని... నిరాశావాదం ఉండకూడదన్నారు. 2016, 2017 దేశానికి కీలకమైన సంవత్సరాలు అని చెప్పారు.
దేశంకోసం జీవించాలనే ధృడసంకల్పం మనందరిలో ఉండాలన్నారు. ఈ విజయం తన ఒక్కడి వల్ల రాదన్నారు. అందరి వల్లే సాధ్యమైందన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మనల్ని ఇక్కడ నిలబెట్టిందన్నారు. తనలాంటి నిరుపేదను అత్యున్నత స్థానంపై కూర్చుండబెట్టిన ప్రజా వ్యవస్థ మనదన్నారు. మార్పు కోసం యువత తమను భుజానికెత్తుకుందన్నారు. పాత విషయాల్ని గుర్తు చేసుకొని నిరాశ చెందవద్దన్నారు. దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. తల్లిపై చూపించాల్సింది కనికరం కాదని సేవ అన్నారు.