బీజేపీ గెలిస్తే..పోల్ విన్నింగ్ మిషన్లుగా ఆడిపోసుకుంటున్నారు: దేశమే ముఖ్యం: మోడీ
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాషాయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. స్వీట్లు పంచి పెడుతున్నారు. కోవిడ్ ప్రొటోకాల్ను పాటిస్తూ.. పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల హృదయాలను మరింత గెలిచేలా క్యాడర్ వ్యవహరించాలని సూచించారు.
పార్టీ కంటే దేశమే ముఖ్యమని ప్రధాని చెప్పారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలకు వాస్తవ రూపం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని సూచించారు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలని అన్నారు. బీజేపీ ఎన్నికలను గెలిచిన ప్రతీసారీ పోల్ విన్నింగ్ మిషన్లుగా అభివర్ణిస్తున్నారని, అది ఎంత మాత్రం ముఖ్యం కాదని మోడీ చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలని అన్నారు. వ్యక్తి కంటే సమూహం (పార్టీ) ముఖ్యం.. సమూహం కంటే దేశం ముఖ్యం.. అని శ్యామా ప్రసాద్ ముఖర్జీ నినదించారని, దాన్ని సార్థకం చేయాలని చెప్పారు.
శ్యామా ప్రసాద్ కలలను నిజం చేస్తూ.. తాము సమైక్య భారతం కోసం పని చేస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడమే దీనికి నిదర్శనమని చెప్పారు. దేశంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకుని రావడానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, మూడు వ్యవసాయ బిల్లులు దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఈ రెండు చట్టాలను అమలు చేయడంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని, దీనికి ప్రధాన కారణం.. ప్రతిపక్ష పార్టీలేనని మోడీ అన్నారు. ప్రజల్లో లేనిపోని భయాలను కల్పించడం ద్వారా వాటిని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు.