తమిళ నేతలది తప్పు: బాబుకు స్వామి మద్దతు, డిగ్గీ సవాల్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో 20 మంది స్మగ్లర్లు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఘటన పైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి శనివారం స్పందించారు. పోలీసులే పట్టుకు వచ్చి కాల్చి చంపారన్న తమిళనాడు నేతల వాదలను స్వామి తోసిపుచ్చారు.
ఇరవై మంది కూలీల మృతి ఘటన పైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సమగ్ర దర్యాఫ్తు పూర్తయ్యాకనే న్యాయ విచారణ ప్రారంభించాలన్నారు. కర్నాటకలో మేకదాటు తాగునీటి ప్రాజెక్టును తమిళనాడు అడ్డుకోవడం సరికాదన్నారు.
యంగ్ ఇండియా సంస్థ పేరిట సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రూ.5వేల కోట్ల మోసానికి పాల్పడ్డారన్నారు. దీనిపై ఈ నెల 22న న్యాయస్థానంలో జరగనున్న వాదనలలో తల్లీకొడుకులతో శిక్ష పడగలదన్నారు. రాహుల్ గాంధీ రెండు నెలలుగా ఎక్కడున్నారో ఆ పార్టీ వారికే తెలియకపోవడం విడ్డూరమన్నారు.
లాటిన్ అమెరికాలో ఉన్నట్లు తెలిసిందన్నారు. జమ్మూ కాశ్మీర్లో రానున్న రోజుల్లో రాష్ట్రపతి పాలన విధించడం ఉత్తమమన్నారు. యూపీఏ, ఎన్డీయే ఆఱ్థిక విధానాల్లో ఎంతో తేడా ఉందన్నారు.
అంతేకాకుండా, ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిన మరుసటి రోజుకే దీనిపై రాజకీయ దుమారం రాజుకుంది. ఈ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ యుద్ధ విమానాలు పూర్తిగా విఫలమయ్యాయని, వీటిని పలు దేశాలు కొనడం లేదని ఆరోపించారు.
యూపీఏ హయాంలో రాఫెల్ విమానాల కోసం జరిగిన ఒప్పందం అవినీతితో కూడుకున్నదన్నారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే తాను కోరుటుకు వెళ్తానని హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సవాల్ విసిరారు. విమానాల కొనుగోలు ఒప్పందం, సంతకాలు తదితర విషయాల్లో అన్నీ తానే అన్నట్లు ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని, స్వామికి దమ్ముంటే ఈ విమానాల కొనుగోలుపై కోర్టుకెళ్లాలన్నారు.