ప్రతిపక్ష నేత డుమ్మా - కొత్త సమీకరణాలు..!!
కోల్కత: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నామినేట్ చేసిన కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు. సువేందు అధికారితో పాటు ఒకరిద్దరు శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కావడం కొత్త వివాదానికి తెర తీసినట్టయింది. సువేందు అధికారి వైఖరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.
1977 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి సీవీ ఆనంద బోస్. కేరళలోని కొట్టాయం ఆయన స్వస్థలం. కొంతకాలం కిందటే పదవీ విరమణ చేశారు. ఆయనను కేంద్ర ప్రభుత్వం గవర్నర్గా ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నామినేట్ చేసింది. ఇదివరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేసిన జగ్దీప్ ధన్కర్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో లా గణేషన్ను గవర్నర్గా అపాయింట్ చేసింది. ఇప్పుడు లా గణేషన్ స్థానంలో సీవీ ఆనంద బోస్ను నియమించింది.

ఈ మధ్యాహ్నం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీవీ ఆనంద బోస్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. వామపక్షాల తరఫున బిమన్ బోస్తో పాటు మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ హాజరయ్యారు.
సువేందు అధికారి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన గైర్హాజర్ అయ్యారని చెబుతున్నారు. సీట్ల అరెంజ్మెంట్ విషయంలో అవమానపరిచిందని సువేందు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తాను ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరు కావాట్లేదనే విషయాన్ని కూలంకషంగా వివరిస్తూ వరుస ట్వీట్లను చేశారాయన. ఆహ్వానితుల కోసం ఏర్పాటు చేసిన సీట్ల కేటాయింపునకు సంబంధించిన ఫొటోలను తన ట్వీట్లకు జత చేశారు. బిశ్వజిత్ దాస్ వంటి ఎమ్మెల్యేల సరసన తాను కూర్చోదలచుకోలేదని వివరించారు.












Click it and Unblock the Notifications