మోదీ సర్కారుకు సిగ్గులేదు.. ఢిల్లీలో కాల్పులు బీజేపీ పనే: లోక్సభలో అసద్, అధిర్ మండిపాటు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఆందోళనలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతుండటం, రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, ఉద్యమకారులపై ఏకంగా కాల్పులు జరపడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా నిరసించాయి. బడ్జెట్ సమావేశాల మూడోరోజైన సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే, టీంఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దారుణంగా చంపేస్తున్నారు..
దేశరాజధాని ఢిల్లీలో కాల్పుల ఘటనలపై కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్ సభలో లేవనెత్తారు. రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ సర్కారు తయారుచేసిన చట్టాన్ని అడ్డుకోడానికే ప్రజలు రోడ్ల మీదికి వచ్చారని, భారత రాజ్యాంగం ప్రతులు, జాతీయ జెండాలు చేతపట్టి, జాతీయ గీతాలు పాడుతూ శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారిపై కాల్పులు జరుగుతున్నాయని, ఆందోళనకారులు కూడా భారతీయులేనన్న కనికరం లేకుండా దారుణంగా చంపేసేప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ గుండాల పనే..
జామియా మిలియా వర్సిటీ దగ్గర విద్యార్థులపై, షాహీన్ బాగ్ లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై కాల్పులకు పాల్పడింది ముమ్మాటికీ బీజేపీ గుండాలేనని అధిర్ చౌదరి ఆరోపించారు. ‘‘నిరసనకారుల్ని భయపెట్టడానికి అధికార పార్టీ ఎంచుకున్న ఎత్తుగడే ఈ కాల్పులు. పాలకపార్టీకి చెందిన గుండాలే ఈ పనులు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలోకి వస్తారుకాబట్టి సహజంగానే ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోయింది''అని అధిర్ చౌదరి అన్నారు.
మోదీ, షా సిగ్గుపడాలి: ఓవైసీ
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో హింసాకాండపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభలో తీవ్ర కామెంట్లు చేశారు. ‘‘మేం జామియా విద్యార్థులకు అండగా ఉంటాం. వాళ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. స్టూడెంట్ల తలలు పగిలిపోయాయి. కొంతమంది కళ్లు పోగొట్టుకున్నారు. ఆడపిల్లల్ని కూడా దారుణంగా కొట్టారు. ఇంతజరుగుతున్నా మోదీ, అమిత్ షా సిగ్గుపడట్లేదు సరికదా, భారతమాత బిడ్డల్ని కాల్చిచంపే ప్రయత్నాలు చేస్తున్నారు''అని ఓవైసీ ఆరోపించారు.