ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు: కాశ్మీర్కు జైట్లీ, జార్ఖండ్కు నడ్డా
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరపడంతో పాటుగా అసెంబ్లీలో శాసన సభా పక్షం నాయకుడి ఎన్నికను పర్యవేక్షించడానికి పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ నాయకత్వంలో ఇద్దరు సభ్యుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.
జమ్మూ, కాశ్మీర్తో పాటుగా జార్ఖండ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చర్చించడానికి బుధవారం ఇక్కడ సమావేశమైన బిజెపి అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి అయిన పార్లమెంటు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా పార్టీ సీనియర్ నేతలందరూ హాజరయ్యారు.
జమ్మూ, కాశ్మీర్లో బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడ్ని ఎన్నుకునేందుకు జరిగే లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి పరిశీలకులుగా జైట్లీ, పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్లు వెళతారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన జెపి నడ్డా మీడియాకు చెప్పారు. కాగా, జార్ఖండ్లో లెజ్లిచర్ పార్టీ నాయకుడి ఎన్నికను పర్యవేక్షించడానికి ఆ రాష్ట్రానికి పరిశీలకులుగా నడ్డా, పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్దేలను పంపాలని కూడా బోర్డు నిర్ణయించింది.
బిజెపి పార్లమెంటరీ బోర్డు జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించిందని, ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిందని నడ్డా చెప్పారు. స్పష్టమైన ప్రజా తీర్పు లభించని జమ్మూ, కాశ్మీర్ గురించి ప్రశ్నిచంగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో సహా అన్ని మార్గాలను పరిశీలించడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
ఈ రెండు రాష్ట్రాల్లో లెజిస్లేచర్ పార్టీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో మాత్రం నడ్డా చెప్పలేదు. అయితే కేంద్ర పరిశీలకులు మూడు నాలుగు రోజుల్లో ఆయా రాష్ట్రాలకు వెళతారని, ఏడాది చివరి నాటికల్లా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.