Bihar polls: బీహార్ లో బీజేపీ తొలి జాబితా విడుదల-డీసీఎంల సీట్లు ఖరారు...!
వచ్చే నెలలో రెండు విడతలుగా జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి అధికార పీఠంపై కన్నేసిన బీజేపీ.. ఇవాళ తమ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఈసారి ఎన్నికల్లో రెండు విడతలు కలిపి మొత్తం 101 సీట్లకు పోటీ చేస్తుండగా.. ఇందులో 71 మంది అభ్యర్ధుల పేర్లను ఇవాళ విడుదల చేసింది. ఇందులో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా పలువురిు సీనియర్లకు చోటు దక్కింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్ధుల తొలి జాబితాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా చోటు దక్కించుకున్నారు. సామ్రాట్ చౌదరి మరోసారి తారాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. విజయ్ సిన్హా లఖీసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు రాం కృపాల్ యాదవ్ (దానాపూర్), ప్రేమ్ కుమార్ (గయ), మాజీ డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ (కతిహార్), అలోక్ రంజన్ ఝా (సహస్ర), మంగళ్ పాండే (శివాన్ ) నుంచి పోటీ చేస్తున్నారు.

మరోవైపు పొత్తులో భాగంగా గట్టి పోటీ ఎదురైనా.. హిసువా స్ధానాన్ని దక్కించుకున్న బీజేపీ అక్కడి నుంచి అనిల్ కుమార్ను బరిలోకి దింపుతోంది. మరో సీనియర్ నేత నంద్ కిషోర్ యాదవ్కు ఈసారి టికెట్ ఇవ్వలేదు. అతని స్థానంలో రత్నేష్ కుష్వాహా పాట్నా సాహిబ్ నుండి పార్టీ అభ్యర్థిగా నిలిచారు. వీటితో పాటు మరికొన్ని మార్పులు కూడా చేశారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6 , 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న లెక్కింపు జరుగుతుంది.
బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి చావోరేవోగా మారాయి. దీనికి కారణం విపక్షం నుంచి ఎదురవుతున్న గట్టి పోటీయే. ఈసారి బీజేపీ మిత్రపక్షం జేడీయూ బలహీనపడిందన్న వార్తల నేపథ్యంలో అత్యధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ తీవ్రంగా శ్రమించక తప్పడం లేదు. అభ్యర్ధుల ఎంపికలోనూ బీజేపీ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications