బీజేపీ షాకింగ్: మధ్యప్రదేశ్లో మంత్రులు సహా 70 మందికి టిక్కెట్ నిరాకరణ!
భోపాల్: మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా నాలుగైదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలిచి, నాలుగోసారి కూడా విజయంపై ధీమాగా ఉంది. అయితే వరుసగా ఓ పార్టీ గెలుస్తూ వస్తుంటే ప్రజా వ్యతిరేకత సహజం. ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై సంతృప్తి ఉన్నా, శివరాజ్ సింగ్ బాగుందని చెప్పినప్పటికీ వ్యతిరేకత సహజం.
ప్రధాని, ముఖ్యమంత్రులపై వ్యతిరేకత లేకున్నప్పటికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై ప్రజలకు వ్యతిరేకత సహజం. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి అది మరింత నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి మధ్యప్రదేశ్లో దాదాపు 70 మంది సిట్టింగ్లకు టిక్కెట్లు ఇవ్వవద్దనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది.
శివరాజ్ సింగ్ అంగీకరిస్తారా?
ఈ 70 మందిలో కొందరు మంత్రులు కూడా ఉండటం గమనార్హం. స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు టిక్కెట్ నిరాకరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై బీజేపీ తర్జన భర్జన పడుతోందని సమాచారం. అయితే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాత్రం దీనికి అంగీకరించే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన దీనిని ఒప్పుకోరని కూడా అంటున్నారు. 70 మందికి టిక్కెట్లు నిరాకరిస్తే బీజేపీ విజయావకాశాలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.
నాలా నా కొడుకు సీఎం వద్దు: రంజన్ గురించి నాడు తండ్రి ఏం చెప్పాడంటే? అసోం హిస్టరీ
దాదాపు సగం మందికి టిక్కెట్ నిరాకరించే యోచన
బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ లాల్ దాదాపు 70 మందికి టిక్కెట్లు నిరాకరిస్తారనే ప్రచారం సాగుతోంది. ఎవరెవరైతే గెలవలేరని భావిస్తారో వారికి టిక్కెట్లు నిరాకరించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి 166 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 70 మందికి అంటే 42 శాతం మందికి టిక్కెట్ నిరాకరించినట్లే. అంటే దాదాపు సగం.
శివరాజ్ సింగ్ భయం
పది పదిహేనేళ్లుగా పార్టీ తరఫున పలువురు ఎమ్మెల్యేలు గెలుచుకుంటూ వస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలతో పాటు పక్క నియోజకవర్గాల పైన కూడా కొంత పట్టు సాధించారు. ఇప్పుడు వారికి టిక్కెట్లు నిరాకరిస్తే కేవలం ఒక నియోజకవర్గంలోనే బీజేపీ నష్టపోదని, పక్కనున్న నియోజకవర్గాల్లోను నష్టపోతుందని ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. బీజేపీ మాత్రం ప్రజా వ్యతిరేకతను ఎలా అధిగమించాలా అని ఆలోచిస్తోంది.
కేబినెట్లోని మంత్రులు
సమాచారం మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్లోను కొందరు మంత్రులు ఓడిపోతారని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అలాగే పలువురు ఎమ్మెల్యేలు గెలవలేరని భావిస్తోంది. వారి స్థానంలో కొత్త వారిని తీసుకు వచ్చే యోచనలో ఉంది. పలు ప్రాంతాల్లో బీజేపీకి మంచి బలం ఉంది. కానీ స్థానిక అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలింది. దీంతో పలువురు అభ్యర్థులను మార్చే యోచన చేస్తోంది.