BJP: ఢిల్లీ విజయం.. బీజేపీ గుప్పిట్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే?
BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగిరింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలను దాటి 48 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. 22 స్థానాలను ఆప్ సాధించింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్కసీటు కూడా గెలుచుకోకుండా చతికిలపడింది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగానే బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు.
ఢిల్లీ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే భారత్ లో బీజేపీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు తప్పిస్తే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ దాని మిత్ర పక్షాలతో కలిసి పాగా వేసింది. తాజాగా ఢిల్లీలో గెలిచి దేశంలోని 21 రాష్ట్రాలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుంది. దేశంలో మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, గుజరాత్, గోవా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, పుదుచ్చేరి, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో బీజేపీకి మద్దతు ప్రభుత్వాలు ఉండగా.. తాజాగా ఢిల్లీ ఆ జాబితాలో చేరింది. ఈ విధంగా మొత్తం బీజేపీ, మిత్ర రాష్ట్రాలు కలిసి 21 రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది.

ఇదిలా ఉండగా.. కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మరోవైపు త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ లో కూడా శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా పాగా వేస్తామని బీజేపీ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తోంది. తమిళనాడు, కేరళ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్ లలో స్థానిక ప్రభుత్వాలు తమ పాలనను కొనసాగిస్తున్నాయి.
రుణపడి ఉంటా..:ప్రధాని మోడీ
ఢిల్లీలో భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని.. అన్ని విధాలుగా ఢిల్లీని అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఇది మోడీ గ్యారంటీ అంటూ పేర్కొన్నారు. ప్రజలు సౌకర్యవంతంగా జీవించేలా కృషిచేస్తామన్నారు. దేశాభివృద్ధిలో ఢిల్లీని భాగం చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. రేయింబవళ్లు గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను ప్రధాని మోడీ అభినందించారు.












Click it and Unblock the Notifications