రేపటిలోగా లిస్ట్ ఇవ్వండి: బ్లాక్మనీపై షాక్, తగ్గిన కేంద్రం
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత చర్యల్లో భాగంగా విదేశాల్లో నల్లధనం దాచిన కేసులకు సంబంధించి కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు ముగ్గురి పేర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఏడుగురి పేర్లు వెల్లడించింది. డాబర్ ఇండియా ప్రమోటర్లలో ఒకరైన ప్రదీప్ బర్మన్, రాజ్కోట్కు చెందిన బులియన్ ట్రేడర్ పంకజ్ చిమన్ లాల్, గోవా గనుల సంస్థ డైరెక్టర్ రాధా ఎస్ టింబ్లో పేర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. మరో నలుగురి పేర్లు కూడా ఉన్నాయి.
అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సాక్ష్యాధారాలు లభించేంత వరకు, ఆ ఆరోపణల పైన భారత్లో విచారణ ప్రారంభించేంత వరకు... విదేశాల్లోని బ్యాంకుల్లో ఖాతాలున్న వారి పేర్లు వెల్లడించలేమని కేంద్రం ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఆ అఫిడవిట్కు అనుగుణంగా 16 పేజీల అఫిడవిట్ సోమవారం దాఖలు చేసింది. ఇందులో టింబ్లో డైరెక్టర్స్ చేతన్ టింబ్లో, రోహన్ టింబ్లో, అన్నా టింబ్లో, మల్లికా టింబ్లోలను కేంద్రం పేర్కొంది. అయితే, వీటిని వారు కొట్టి పారేసిన విషయం తెలిసిందే.
నల్ల కుబేరుల జాబితాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
నల్ల కుబేరుల జాబితా పైన కేంద్రానికి సుప్రీం కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. విదేశాల్లో డబ్బు దాచిన వారందరి పేర్లు బయట పెట్టాలని సూచించింది. రేపటిలోగా జాబితా సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటి తీర్పులో ఒక్క పదం కూడా మార్చేది లేదని స్పష్టం చేసింది.
రేపటిలోగా ఇస్తాం: జైట్లీ
రేపటిలోగా నల్లధనం ఖాతాదారుల పేర్లు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పేర్లు వెల్లడించాడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సుప్రీం ఏర్పాటుచేసిన సిట్కు ఖాతాదారుల పేర్లు ఇస్తామని, ఈ కేసులో దర్యాప్తు చేయడానికి ప్రభుత్వానికి ఎవరితోనూ ఎలాంటి వివాదం లేదన్నారు.
గాగా, విదేశీ బ్యాంకుల్లో నల్లధనం ఖాతాలున్న వారి పేర్లను బైటపెడుతున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనం ఖాతాల వివరాలను ముక్కలు ముక్కలుగా వెల్లడించటం వెనక దురుద్దేశం ఉన్నదని దుయ్యబట్టారు.
ఎన్డీయే ప్రభుత్వం అన్ని పేర్లు ఒకేసారి బయటపెట్టాలి తప్ప ఇలా రెండు, మూడు పేర్లు బయటపెడుతూ రాజకీయం చేయటం మంచిది కాదన్నారు. నల్లధనం ఖాతాల విషయాలు బయటికి వస్తే కాంగ్రెస్కే నష్టం కలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పి వారం రోజులు గడుస్తున్నాయని, ఇప్పుడు రెండు, మూడు పేర్లు బయటపెట్టి ఏదో సాధించామనే విధంగా వ్యవహరిస్తున్నారని సింఘ్వి విమర్శించారు.
ధైర్యముంటే అన్ని పేర్లను ఒకేసారి వెల్లడించాలని ఆయన ఎన్డియే ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. నల్లధనం ఖాతాల వ్యవహారాన్ని సంచలనం చేసేందుకు ప్రయత్నించటం మంచిది కాదన్నారు. నల్లధనం ఖాతాలకు సంబంధించిన అన్ని పేర్లను ప్రత్యేక దర్యాప్తు సంస్థకు వెంటనే ఇవ్వాలని సింఘ్వి డిమాండ్ చేశారు. యోగా గురువు రాందేవ్ లెక్క ప్రకారం నల్లధనం విదేశీ ఖాతాలు దాదాపు యాభై వేలు, ఈ ఖాతాల్లో లక్షల కోట్ల నల్లధనం ఉన్నదన్నారు.
ఇప్పుడేం జరిగింది, మూడు పేర్లు బయట పెట్టటం ఏమిటి అని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు మూడు పేర్లు బయటపెట్టి ఏదో సాధించామనుకుంటే ఎలా అని సింఘ్వి ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ నల్లధనం ఖాతాల గురించి చాలా చెప్పారు, ఇంతవరకు అందుకు సంబంధించి యాభై రూపాయలు కూడా స్వదేశానికి తెచ్చిన దాఖలాలు లేదన్నారు.
గాంధీ కుటుంబానికి చెందనివారు కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నాయని చెప్పిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను కాంగ్రెస్ వెనకేసుకు వచ్చింది. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను విడిగా చూడటం మంచిది కాదని సింఘ్వి అన్నారు. కాంగ్రెస్ను పటిష్టం చేసేందుకు ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని ఆయన చెప్పారు.