బోడో ఘాతుకం: అస్సాంలో 48 మంది ఆదివాసీల ఊచకోత
గౌహతి: అసోం రాష్ట్రంలో బోడో తీవ్రవాదులు అత్యంత కిరాతకమైన చర్యకు ఒడిగట్టారు. 48 మంది ఆదివాసీలను ఊచకోత కోశారు. మంగళవారం నాడు ఐదుచోట్ల వారు దాడులకు దిగారు. సాయంత్రం ఐదు గంటలకు సోనిట్పూర్ జిల్లా మైతాలుబస్తీలో దారుణకాండ మొదలైంది. పభోయ్ అటవీ ప్రాంతంలోని ఆదివాసీలపై దాడికి దిగారు. ఈ ఒక్కచోటే సుమారు 30 మందిని బలి తీసుకున్నారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే కొక్రాఝార్ జిల్లాలోని పాఖ్రిగురి గ్రామంపై దాడి చేశారు. ఇక్కడ ముగ్గురిని చంపారు. ఆ వెంటనే కొద్దిసమయం తేడాలోనే సోనిట్పూర్ జిల్లాలోనే రెండుచోట్ల ఆదివాసీలపై దాడికి దిగారు. ఈ రెండుచోట్ల సుమారు 15 మందిని బలి తీసుకున్నారు. కొక్రొఝార్ జిల్లా ఉల్టాపానీలోనూ కాల్పులు జరిపారు. అయితే, అక్కడ ఎవరూ చనిపోలేదు.
ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో తొలుత 34 మంది చనిపోయినట్లు భావించారు. ఆ తర్వాత కూడా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. వెరసి మృతుల సంఖ్య 48కి చేరిది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు నిలిపివేయకపోతే ప్రతీకార దాడులకు దిగుతామని సోమవారమే ఎన్డీఎఫ్బీ(ఎస్) ఉగ్రవాదులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాగా దాడులు జరిగిన ప్రాంతాలన్నీ ‘బోడోల్యాండ్ ప్రాదేశిక స్వయంప్రతిపత్తి' (బీటీఏడీ) పరిధిలోని జిల్లాల్లోనివే. భారత్-టిబెట్ సరిహద్దుల్లోని మారుమూల గ్రామాలను ఎంచుకుని రక్తపాతం సృష్టించారు. తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్డీఎఫ్బీ ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. దీనిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.