మనీలాండరింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి: విచారించిన ఈడీ!
ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBetకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీహార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అజిత్ శర్మ కుమార్తె, బాలీవుడ్ నటి నేహా శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధాన కార్యాలయంలో నేహా శర్మను అధికారులు విచారించారు.
నేహా శర్మ మంగళవారం ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆమెను అనేక గంటల పాటు ప్రశ్నించారు.ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఏజెన్సీ గత వారమే ఆమెకు సమన్లు పంపి, డిసెంబర్ 2న విచారణకు రావాలని ఆదేశించింది. 1xBet ప్లాట్ఫామ్కు సంబంధించిన కొన్ని ప్రచార కార్యకలాపాలు, ప్రకటనలు నేహా శర్మ చేశారని, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సందేహాస్పదంగా ఉన్నాయని ఈడీ అనుమానిస్తోంది. ఎండోర్స్మెంట్ ఫీజు చెల్లింపులు లేయర్డ్ ట్రాన్సాక్షన్లు, విదేశీ మార్గాల ద్వారా జరిగాయని ఈడీ భావిస్తోంది. దీనిపైనే ప్రధానంగా దర్యాప్తు జరుగుతోంది. ఈడీ ఆమె వాంగ్మూలాన్ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదు చేసింది.

గతంలో విచారించిన ప్రముఖులు
1xBet మనీలాండరింగ్ కేసులో ఈడీ గతంలోనూ పలువురు ప్రముఖులను విచారించింది. క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్ విచారణలో పాల్గొన్నారు. నటి ఊర్వశి రౌతేలా కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. ఆమె గతంలో ఈ యాప్కు ఇండియా అంబాసిడర్గా వ్యవహరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తుల నుంచి ఈడీ ఇప్పటికే రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈడీ ప్రకారం, 1xBet ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ భారతదేశంలో సరైన లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహించింది.
సోషల్ మీడియా, ఆన్లైన్ వీడియోలు మరియు ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు, సరొగేట్ బ్రాండింగ్ ద్వారా లక్షలాది మంది యువతను బెట్టింగ్ వైపు ఆకర్షించినట్లు ఏజెన్సీ ఆరోపిస్తోంది.నటి నేహా శర్మ 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తన తండ్రి అజిత్ శర్మ కోసం ప్రచారం చేశారు. ఆమె భాగల్పూర్లో రోడ్ షో నిర్వహించి ఓటర్ల మద్దతు కోరారు. అయితే ఈ ఎన్నికల్లో అజిత్ శర్మ ఓడిపోయారు.












Click it and Unblock the Notifications