Budget 2023: వీరిద్దరూ మహిళా శక్తికి నిలువుటద్దం: చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా..!!
పార్లమెంట్ లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టాల్సిన ఉన్న నేపథ్యంల- కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఆ శాఖ సహాయమంత్రులు, ఇతర అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాదపూరకంగా భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తోన్న వార్షిక బడ్జెట్.. ఇంకాస్సేపట్లో సాక్షాత్కరించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ (Budget 2023) ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. గత రెండేళ్ల తరహాలోనే ఇది కూడా పేపర్ లెస్ బడ్జెట్. బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ సామాన్య పౌరులకు అందుబాటులో ఉంచింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ మొబైల్ యాప్, వెబ్ సైట్ లో పొందుపర్చనుంది కేంద్రం.
దేశ రాజధానిలో బడ్జెట్ హడావుడి నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం కొనసాగుతున్న నార్త్ బ్లాక్ సహా, ఆ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సహాయ మంత్రులు భగవత్ కరద్, పంకజ్ చౌదరి నివాసాల్లో ఈ తెల్లవారు జాము నుంచే సందడి నెలకొంది. నార్త్ బ్లాక్ తో పాటు నిర్మల సీతారామన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు గుమికూడారు. బడ్జెట్ నేపథ్యంలో భగవత్ కరద్ తన నివాసంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
నిర్మల సీతారామన్ కూడా ఇంట్లో పూజలను నిర్వహించిన అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్న బాహిఖాతాతో నార్త్ బ్లాక్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన శాఖకు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు భగవత్ కరద్, పంకజ్ చౌదరి, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నేరుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూరకంగా కలుసుకున్నారు. బడ్జెట్ కాపీలను అందజేశారు.
అనంతరం పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. అక్కడే ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హజరయ్యారు. ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సమావేశం ఆమోదించింది. అనంతరం పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రతిపాదలను ప్రవేశపెడతారు.
కాగా- రాష్ట్రపతి, ఆర్థిక శాఖ మంత్రి ఇద్దరూ మహిళలే కావడం ఈ బడ్జెట్ కు ప్రాధాన్యత ఏర్పడింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆయా ఉన్నత పదవుల్లో ఇద్దరూ మహిళలే ఆసీనులు కావడం ఇదే తొలిసారి. 2007 నుంచి 2012 మధ్యకాలంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆమె హయాంలో పీ చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా నిర్మల సీతారామన్ ఆర్థికమంత్రిగా పని చేస్తోన్న సమయంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
Budget 2023: తినబోతూ రుచులెందుకు..!!