రాజ్యసభ: దెబ్బతీసేందుకు మహిళా వ్యాపారవేత్త చక్రం
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. యూపీలో 11 స్థానాలు ఖాళీ ఉన్నాయి. అయితే పన్నెండు మంది బరిలో నిలిచారు. ఫ్యాషన్ పైన ఆసక్తి కలిగి ఉన్న మహిళా వ్యాపారవేత్త ప్రీతి మహాపాత్ర స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
పదకొండు మంది వివిధ పార్టీల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ 11 రాజ్యసభ స్థానాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. అయితే, కమలదళం వ్యూహాత్మకంగా ఈ మహిళా వ్యాపారవేత్తకు మద్దతు ఇస్తోంది. ఈమె వయస్సు 37 ఏళ్లు.
ప్రీతి మహాపాత్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు బీజేపీ మద్దతు లభించింది. రాష్ట్రంలో మిగతా రాజ్యసభ స్థానాలకు పోను.. బీజేపీకి కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే అదనంగా ఉన్నారు. ఓ రాజ్యసభ స్థానం గెలవాలంటే 34 మంది మద్దతు కావాలి.
బీజేపీ నుంచి శివ ప్రతాప్ శుక్లా బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతివ్వగా పోను ఇంకా ఏడుగురు సభ్యులు మాత్రమే బిజెపికి ఎక్కువగా మిగులుతారు. ఈ ఏడుగురు మద్దతుతోనే తొలుత ఆమె బరిలో నిలిచారు. రాజ్యసభ సీటు గెలవాలంటే ఆమెకు 27 మంది సభ్యుల మద్దతు కావాలి.
ఈ నేపథ్యంలో ప్రీతి మహాపాత్ర.. ఇతర పార్టీలలోని అసంతృప్తుల పైన కన్నేశారు. ఆమె మాట్లాడుతూ.. తాను స్వతంత్ర అభ్యర్థినని, తనకు ఓటు వేయాలని తాను అందరినీ అడుగుతున్నానని చెప్పారు. మీ ఆత్మపరిశీలనతో ఓటు వేయాలని అందరినీ కోరుతున్నానని చెప్పారు.
ఇప్పటికే తాను అందరినీ సంప్రదించానని చెప్పారు. 11వ తేదీన ఎన్నికలు జరిగే సమయంలో సభ్యులు చాలామంది తనకు ఓటు వేస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనకు బీజేపీ సభ్యులు బహిరంగంగా మద్దతిచ్చారని, ఇందుకు వారికి ధన్యవాదాలు అన్నారు. ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే రాంపాల్ యాదవ్ కూడా ప్రీతి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.