బరిలో ప్రియాంకాగాంధీ.. అక్కడ నాలుగు రోజుల పర్యటన
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ వాద్రా.. బరిలో దిగబోతున్నారు. సోమవారం నుంచి ఆమె నాలుగు రోజుల పాటు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ ట్రంప్ కార్డ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవవలే క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె కోసం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించారు. రెండురోజుల కిందటే బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకా గాంధీ క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టి పెట్టారు. పార్టీ బలహీనంగా ఉన్నట్టు భావిస్తోన్న ఉత్తర్ ప్రదేశ్ నుంచే ఆమె రాజకీయ క్రియాశీలక కార్యకలాపాలు ఆరంభం కాబోతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ పై ఆమె తన దృష్టి కేంద్రీకరించారు. 80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. స్వయంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ నుంచే లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్ లో వారిద్దరూ ఆత్మవిశ్వాసాన్ని నింపలేకపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎదుర్కొన్న ప్రతీ ఎన్నికల్లోనూ వరుసగా ఓటమి పాలవుతూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాది పార్టీ లేక బహుజన్ సమాజ్ వాది పార్టీల మధ్యే అధికారం చేతులు మారుతూ వచ్చింది. కాంగ్రెస్ ను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మమతా బెనర్జీ నేతృత్వంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చినప్పటికీ.. ఉత్తర్ ప్రదేశ్ వరకు కాంగ్రెస్ ను ఎస్పీ-బీఎస్పీ వెలివేసింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ రెండు పార్టీలు జట్టు కట్టాయి.

దీనితో జనంలో మరింత చులకనకు గురైంది హస్తం పార్టీ. దీనితో ప్రియాంకా గాంధీని బరిలో దించాల్సి వచ్చింది కాంగ్రెస్ కు. ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించడం వెనుక ఉద్దేశం కూడా అదే. బాధ్యతలను తీసుకున్న 48 గంటల్లోనే ప్రియాంక గాంధీ.. క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధపడుతున్నారు. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆమె ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఈ నెల 14వ తేదీన ఆమె ఈ భేటీలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ప్రియాంకా గాంధీ వెంట రాహుల్ గాంధీ కూడా ఈ పర్యటనలో పాల్గొంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications