CAA: భారత పౌరసత్వం పొందాలంటే ట్విస్టు విధించిన కేంద్రం..అవి ఉంటేనే..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుండగా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. చట్టంతో ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్న ప్రభుత్వం... పొరుగుదేశాలు అయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ల నుంచి భారత్కు వలస వచ్చిన అక్కడి మైనార్టీలు తమకు భారత పౌరసత్వం కావాలంటే కేంద్రం ఓ ట్విస్టును పెట్టింది.
మతంకు సంబంధించి రుజువులు
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్లలో మైనార్టీలుగా ఉన్న ముస్లింయేతర ప్రజలు భారత పౌరసత్వం పొందేందుకు వారి ఏ మతస్తులో చెబుతూ రుజువులు జతపర్చడంతో పాటు వారు 31 డిసెంబర్ 2014లోగా భారత్కు వచ్చారనేదానికి కూడా రుజువులు జతపర్చాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీ మతస్తులు 31 డిసెంబర్ 2014లోపు భారత్కు వచ్చి నివాసముంటున్నట్లు డాక్యుమెంట్లలో రుజువులతో సహా పొందుపర్చాల్సి ఉంటుందని ఆమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అస్సాంలో దరఖాస్తుకు మూడునెలల సమయం
ఇదిలా ఉంటే అస్సాంలో ఉన్న వారికి మాత్రం ప్రభుత్వం భారత పౌరసత్వం పొందేందుకు మూడు నెలల సమయం మాత్రమే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్, ఆర్థికశాఖ మంత్రి హిమాంత బిస్వా శర్మలు హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి తమ రాష్ట్రంలో పౌరసత్వం పొందేందుకు పరిమితి గడువును విధించాలని కోరడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాల్లోని ప్రొవిజన్స్ను కూడా సీఏఏలో చేర్చాలని వీరు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
అస్సాం ఒప్పందకు తూట్లు పొడిచేలా సీఏఏ
అస్సాం ఒప్పందంకు తూట్లు పొడిచేలా పౌరసత్వ సవరణ చట్టం ఉందని అస్సాంలో చాలా మంది భావిస్తున్నారు. అస్సాంలో ముందునుంచి ఉన్న వారికి సీఏఏతో ఇబ్బందులు తప్పవనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. 1971 తర్వాత ఎవరైతే అక్రమంగా ఇతర దేశాల నుంచి అస్సాంకు వచ్చి అక్కడ నివాసముంటున్నారో వారిని గుర్తించి తిరిగి తమదేశాలకు పంపివేయాలని అస్సాం ఒప్పందం చెబుతోంది. అయితే కేంద్రం మాత్రం 31 డిసెంబర్ 2014లోపు వచ్చిన వారికి భారత పౌరసత్వం లభిస్తుందని సీఏఏలో పేర్కొంది. ఇదే అస్సాంలో అగ్గి రాజేసింది.