భద్రాచలం: సీమాంధ్రకు మండలాలు కాదు, 134గ్రామాలే
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లులో మరో సవరణ చేసింది. గత కేబినెట్లో పోలవరం కింద ముంపునకు గురయ్యే గ్రామాలున్న ఏడు మండలాలను సీమాంధ్రలే చేర్చింది. బుధవారం జరిగిన భేటీలో ఆ మండలాలను యథాతథంగా తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించింది. అయితే ముంపునకు గురయ్యే 134 గ్రామ పంచాయతీలనే సీమాంధ్రలో చేర్చింది. 134 గ్రామపంచాయతీల కింద 205 గ్రామాలు ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురి కాని భద్రాచలం డివిజన్లోని పలు గ్రామాలను తెలంగాణాలోనే ఉంచాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించింది. భద్రాచలం, పాల్వంచ డివిజన్లోని ఆరేడు మండలాలోని పలు గ్రామాలను సీమాంధ్రకు బదిలీ చేయటం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని సంకీర్ణ ప్రభుత్వం ఇంతకు ముందు నిర్ణయించింది.
అయితే సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి బలరాం నాయక్లు గట్టిగా వ్యతిరేకించారు. దీనితో సంకీర్ణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కింది ముంపుకు గురి కాని గ్రామాలను తెలంగాణాలోనే కొనసాగించాలని నేటి మంత్రివర్గంలో నిర్ణయించింది.
కాగా, ప్రస్తుత అసెంబ్లీ స్పీకరు రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఎపి శాసన సభకు స్పీకరుగా, డిప్యూటీ స్పీకర్ తెలంగాణ అసెంబ్లీకి తాత్కాలిక స్పీకరుగా వ్యవహరించేలా మార్పులు బిల్లులో జరిగాయి. బిల్లుకు ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల సంఖ్య 34గా ఉన్నాయి.
కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు అక్కడే వ్యతిరేకించటంతోపాటు తమ అసమ్మతి నోటును అందజేశారు. సంకీర్ణ ప్రభుత్వం సీమాంధ్రకు 134 గ్రామాలను సీమాంధ్రకు ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు వెనకకు తీసుకోవటం ఎంత మాత్రం మంచిది కాదని కావూరి స్పష్టం చేశారు.