పైలట్టా ..కో పైలట్టా : సొంతంగా ఎదిగే సీన్ ఉందా.. చరిత్ర ఏం చెబుతోంది..?
జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఫైట్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తనకు మద్దతుగా నిలిచే ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండాను ఎగురవేశారు సచిన్ పైలట్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ అతన్ని డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పిస్తూ అదే సమయంలో పీసీసీ పదవి నుంచి కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో రాజస్థాన్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా సచిన్ పైలట్తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేయడంతో మ్యాటర్ కాస్త హైకోర్టు చేరింది. అయితే కాంగ్రెస్ను కాదని సచిన్ పైలట్ రాజస్థాన్లో మనుగడ సాధిస్తారా..? బీజేపీని దూరం పెట్టి రాజకీయం చేయగలడా అనేది రాజస్థాన్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలట్ అసంతృప్తి
సచిన్ పైలట్... రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. వసుంధరా రాజే ప్రభుత్వంకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశాక అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే రాష్ట్ర పగ్గాలు అతనికే దక్కుతాయని ఆశపడి భంగపడ్డాడు. సీఎం కుర్చీపై కలలు కంటుండగానే సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ సీన్లోకి రావడంతో సచిన్ పైలట్ కలలు కల్లలయ్యాయి. ఇక అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి సచిన్ పైలట్లో ఏదో తెలియని అసంతృప్తి. దీంతో అశోక్ గెహ్లాట్కు నిద్రలేని రాత్రులు ప్రారంభమయ్యాయి. ఎప్పటికైనా సచిన్ నుంచి తన ప్రభుత్వానికి ముప్పు ఉందని భావిస్తూ వచ్చిన గెహ్లాట్కు అనుకున్నంతా జరిగింది.

రాజస్థాన్లో కాంగ్రెస్ లేదా బీజేపీ ప్రభుత్వం
ఇక సచిన్ పైలట్ వ్యతిరేక జెండా ఎగురవేయడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ముందుగా బీజేపీలో చేరుతారని అసలు కమలం పార్టీ తెరవెనక ఉండి నడిపిస్తోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాను మాత్రం బీజేపీలో చేరడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇటు కాంగ్రెస్ను కాదని బీజేపీలో చేరకుండా సచిన్ కొత్త పార్టీ పెడతారా అనే సందేహాలు అందిరిలో మొదలయ్యాయి. ఒకవేళ కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ బీజేపీల మధ్య తట్టుకోగలరా అనే చర్చ మొదలైంది. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజస్థాన్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదా బీజేపీ సర్కార్ పాలన చేసింది. సొంత కుంపటి పెట్టుకున్న వారిని అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఇది చరిత్రలోకి వెళితే ఈ విషయం అర్థమవుతుంది. ఘన్శ్యాం తివారీ, కిరోరీలాల్ మీనా, దేవీ సింగ్ భాటి, లోకేంద్ర సింగ్ కల్వి, లేదా హనుమాన్ బేనీవాల్.. వీరంతా కొత్త పార్టీ పెట్టారు కానీ ఎక్కడా విజయం సాధించలేదు.

విఫలమైన ఘన్శ్యాం మరియు కిరోరీ లాల్
2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఘన్శ్యాం తివారీ అప్పటి సీఎం వసుంధరరాజేతో విబేధించి భారత్ వాహిని పార్టీ స్థాపించారు. అయితే ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉన్న తివారీ కొత్త పార్టీ పెట్టి చతికిలపడ్డారు. కనీసం తాను కూడా గెలవలేదు. ఇక చేసేదేమీ లేక హస్తం పార్టీకి షేక్హ్యాండ్ ఇచ్చారు. ఆయనకు ముందు బీజేపీతో విబేధించిన కిరోరీ లాల్ మీనా దివంగత మాజీ లోక్సభ స్పీకర్ పీఏ సంగ్మా ప్రారంభించిన నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ బీజేపీలకు మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని భావించిన మీనాకు భంగపాటు తప్పలేదు.2013లో ఈ గిరిజన నేత మూడు సీట్లు మాత్రమే గెలిచారు. 2018లో తిరిగి బీజేపీ గూటికి చేరి ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు.

వేరుకుంపటితో అట్టర్ ఫ్లాప్ అయిన బేనీవాల్
వృద్ధ నేతలు లేదా సీనియర్ నేతలు జాతీయ పార్టీలను వీడి సొంత పార్టీలు పెట్టి విఫలమైన సంగతి తెలిసి కూడా మరో నేత జాట్ సామాజిక వర్గంకు చెందిన హనుమాన్ బేనీవాల్ 2018లో రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీని స్థాపించారు. తన సామాజిక వర్గంలో ఆయనకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత మద్దతు బేనీవాల్కు సంపూర్ణంగా ఉన్నప్పటికీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్పీ కేవలం మూడు సీట్లలో మాత్రమే గెలవగలిగింది. ఆ వెంటనే బేనీవాల్ కమలం పార్టీకి మద్దతు పలికి 2019లో ఒక లోక్సభ స్థానం గెలవడం ద్వారా గట్టెక్కారు.

సచిన్ పైలట్ చరిత్రను తిరగరాస్తారా..?
ప్రస్తుతం గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కృత నిశ్చయంతో ఉన్న సచిన్ పైలట్కు ఈ ఎపిసోడ్లో భంగపాటు తప్పలేదు. గెహ్లాట్కు సరిపడ సంఖ్యా బలం ఉండనే ఉంది. పోనీ కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టి నెగ్గుకురాగలడా అంటే చరిత్ర చూపిస్తున్న బొమ్మతో అది సాధ్యం కాదనే తెలుస్తోంది. మరి సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి చేరుకుంటారా.. లేక కమలం పార్టీతో కమిట్ అయిపోతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సొంత పార్టీ పెడితే ప్రజలు సచిన్ పైలట్ను ఆదరిస్తారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications