ఎయిర్ లైన్స్ మరో దాష్టీకం- సాయం అడిగిందని క్యాన్సర్ రోగిని విమానంలో నుంచి దింపేశారు..
ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానం లో ఎయిర్ హోస్టెస్ సాయం అడిగిన మహిళా క్యాన్సర్ రోగిని అవమానవీయంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో దింపేసిన ఘటన కలకలం రేపుతోంది.
భారత్ లో విమానయాన సంస్ధల దాష్టీకాలు చూస్తూనే ఉన్నాం. నిబంధనలు అన్నీ అమల్లో ఉన్నా వాటిని లెక్కచేయకుండా ప్రయాణికులతో ఆడుకుంటున్న ఘటనలకు తోడు విమానం ఎక్కాలంటేనే భయపడేలా తోటి ప్రయాణికులతో కొందరు వ్యవహరిస్తున్న ఘటనల్నీ చూశాం. ఇప్పుడు ఏకంగా విమానయాన సిబ్బందే ఓ క్యాన్సర్ రోగిని ఓ చిన్న సాయం కోరిందని అర్ధాంతరంగా విమానం నుంచే దించేసిన వ్యవహారం కలకలం రేపుతోంది.
తాజాగా జనవరి 30న క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కారు. ఆమె తనతో పాటు ఓ భారీ బ్యాగ్ తెచ్చుకున్నారు. దాన్ని క్యాబిన్ లో పెట్టేందుకు ఆమె ఎయిర్ హోస్టెస్ సాయం కోరారు. అయితే ఆమెకు సాయం చేయకపోగా.. వాగ్వాదానికి దిగిన సదరు ఎయిర్ హోస్టెస్ మహిళని, క్యాన్సర్ బాధితురాలని కూడా చూడకుండా విమానం నుంచి దించేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఈ ఘటనను సోషల్ మీడియా బయటపెట్టడంతో కలకలం రేగింది.

5 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న హ్యాండ్బ్యాగ్ను క్యాబిన్ లో పెట్టడంలో తమకు సహాయం చేయడానికి నిరాకరించారని ఆరోపిస్తూ మీనాక్షి సేన్గుప్తా అనే యునైటెడ్ స్టేట్స్కు చెందిన ప్రయాణికురాలు ఫ్లైట్ అటెండెంట్పై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బలహీనమైన అవయవాల కారణంగా ఆమె తన బ్యాగ్ క్యాబిన్ లో పెట్టలేకపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్, విమానాశ్రయ అధికారులకు చేసిన ఫిర్యాదులో, మీనాక్షి సేన్గుప్తా తన సీటుకు వీల్చైర్ సహాయం కోసం కూడా అభ్యర్థించినట్లు చెప్పారు. అయితే తనను ఏకంగా విమానం నుంచే దించేశారని ఆవేదన వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications