డెబిట్కార్డు ద్వారా రూ.230 టోల్ ఫీజు చెల్లింపు, రూ.87 వేలు మాయం
ముంబై:డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరస్తులు కూడ పెట్రేగిపోతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఖాతాదారులకు తెలియకుండానే డబ్బును స్వాహ చేస్తున్నారు. డెబిట్ కార్డు ద్వారా రూ.230 టోల్ ఫీజు చెల్లించిన కొద్ది గంటల్లోనే ఆయన ఖాతా నుండి రూ. 87వేలు మాయమయ్యాయి.ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
మహరాష్ట్రలోని పూణెకు చెందిన దర్శన్ పాటిల్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. గత శనివారం పాటిల్ ముంబయి నుంచి పుణె తిరిగి వస్తుండగా.. ఖాలాపూర్ టోల్ ప్లాజా వద్ద డెబిట్ కార్డు ద్వారా రూ. 230 చెల్లించాడు.
టోల్ ప్లాజా వద్ద రూ.230 చెల్లించిన రెండు గంటలకు దర్శన్ పాటిల్ ఖాతా నుండి రూ.20వేలు వస్తువులు కొనుగోలు చేసినట్టు ఆయన ఫోన్కు మేసేజ్ వచ్చింది. వరుసగా ఆరు దఫాలు ఆయన ఖాతా నుండి డబ్బులు డ్రా చేశారు. నాలుగు నిమిషాల వ్యవధిలోనే రూ.87వేలను ఖర్చు చేశారు.
డబ్బులు చెల్లించే సమయంలో తన సెల్ఫోన్కు ఓటిపి కూడ రాలేదని ఆయన గుర్తు చేశారు. కానీ తన కార్డు పిన్ నెంబర్ను కూడ ఎవరికీ ఇవ్వలేదని బాధితుడు చెప్పారు. అంతేకాదు టోల్ప్లాజా వద్ద కూడ తానే పిన్ నెంబర్ను నమోదు చేసినట్టు దర్శన్ చెప్పారు. అయితే అక్కడ సిసిటీవి కెమెరాలున్నాయని, అందులో చూసి ఎవరైనా తన కార్డును దుర్వినియోగం చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. బాధితుడు దర్శన్ పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.