ఇక ఎక్కడినుంచైనా ఓటేయవచ్చు-రిమోట్ ఈవీఎం తెస్తున్న ఈసీ- ప్రయోజనాలివే..
భారత్ లో ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపర్చేందుకు, ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఎన్నికల సంఘం కొత్తగా ఓ ప్రయోగానికి తెరలేపబోతోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న బూత్ లకు వెళ్లి ఓట్లు వేసే విధానం స్ధానంలో రిమోట్ విధానం ద్వారా ఎక్కడి నుంచైనా ఓటు వేసేందుకు ఓటర్లకు ఇది అవకాశం కల్పించబోతోంది. దీంతో ఈసీ తయారు చేసిన కొత్త రిమోట్ ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రం ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త యంత్రం, దాని వల్ల ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..

రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం
పోలింగ్ బూత్ లకు నేరుగా వచ్చి ఓటు వేసేందుకు వీల్లేని వారి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కూడా ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాముల్ని చేసేందుకు ఎన్నికల సంఘం రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని తయారు చేసింది. ఈ యంత్రం ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉండి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలింగ్ బూత్ లకు రావాల్సిన అవసరం లేదు, క్యూల్లో నిలబడాల్సిన అగత్యం లేదు. దీంతో ఓటింగ్ శాతాలు పెరుగుతాయని ఈసీ అంచనా వేస్తోంది. రిమోట్ ఇ-ఓటింగ్ మెషిన్ అనేది ఒక స్వతంత్ర పరికరం. దీన్ని ఆపరేట్ చేయడానికి కనెక్టివిటీ అవసరం లేదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ పార్టీలకు డెమో
ఈ కొత్త రిమోట్ ఈవీఎంపై రాజకీయ పార్టీల్ని ఒప్పించేందుకు, వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం.. ఈ నెల 16న ఓ కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనాలని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపింది. అలాగే రాజకీయ పార్టీలకు ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు దీని పనితీరుని కూడా వివరించబోతోంది. అనంతరం దీంతో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. రాజకీయ పార్టీలు చేసే సూచనల్ని కూడా ఈసీ పరిగణనలోకి తీసుకోనుంది.రిమోట్ ఓటింగ్ను ప్రవేశపెట్టేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి, ఓటర్ల నమోదు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని ఈసీ ప్రకటనలో పేర్కొంది.

రిమోట్ ఈవీఎం ప్రయోజనాలివే
ఈసీ ఆధ్వర్యంలో కేంద్రం అభివృద్ధి చేసిన బహుళ నియోజకవర్గాల రిమోట్ ఈవీఎం.. ఒకే రిమోట్ పోలింగ్ బూత్ నుండి 72 నియోజకవర్గాల వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని ఈసీ చెబుతోంది.
వలసల కారణంగా ఓటర్లు ఓటు వేయలేకపోవడం సమస్యగా ఉందని, ఈ రిమోట్ ఈవీఎం ద్వారా ఓటర్ల సంఖ్యను పెంచవచ్చని చెబుతోంది. అలాగే ఎన్నికలలో వలస ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఇది పూర్తిస్ధాయిలో అమలైతే వలస ఓటర్లు ఇక స్వస్ధలాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఉన్న చోటు నుంచే ఓటేయవచ్చు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 67.4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అలాగే 30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని, వలస వచ్చిన జనాభాలో ఎక్కువ మంది ఓటు వేయడంలో విఫలమవడం ప్రధాన కారణాలలో ఒకటి అని ఈసీ చెబుతోంది.

రిమోట్ ఈవీఎం పనితీరు ఇలా..
రిమోట్ ఈవీఎం ద్వారా ప్రతీ నియోజకవర్గం బయట ఉన్న ఓటర్లు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే రిమోట్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు కలుగుతుందని ఈసీ చెబుతోంది. అయితే ఈ ఈవీఎం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ కాదు. అయినా ఇందులో స్టోర్ అయిన సమాచారాన్ని ఆ తర్వాత ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసి పొందవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తద్వారా అధికారులకు, పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఇలా అందరికీ ప్రయోజనం ఉంటుందని ఈసీ చెబుతోంది.












Click it and Unblock the Notifications