రాజకీయపార్టీలకు త్వరలో ఈసీ భారీ షాక్ -ఎన్నికల ముందే హామీలకయ్యే ఖర్చు చెప్పాల్సిందే..
దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న ఉచిత పథకాల హామీలపై చర్చ జరుగుతున్న వేళ ఈసీ మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల గురించి ముందుగానే చెప్పాలని, అలాగే వాటికయ్యే ఖర్చును కూడా వెల్లడించాలని ఈసీ కోరబోతోంది. దీంతో రాజకీయ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తప్పేలా లేదు.
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పెట్టే ఖర్చుపై ఇప్పటికే పరిమితులు, నిఘా పెడుతున్న ఎన్నికలసంఘం.. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చే హామీలకు అయ్యే ఖర్చును కూడా వెల్లడించాలని రాజకీయ పార్టీల్ని కోరబోతోంది. తద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా మారతాయని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసే వాగ్దానాల ఖర్చును తెలుసుకుని అవి నెరవేరతాయో లేదో గుర్తించి అప్పుడు ఓటర్లు తగిన పార్టీలకు లేదా అభ్యర్ధులకు ఓటు వేసే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న ఉచిత హామీల్ని అడ్డుకునేందుకు చట్టపరంగా ఎలాంటి ఏర్పాట్లు లేవని భావిస్తున్న సుప్రీంకోర్టు.. దీనిపై రాజ్యాంగ ధర్మాసనంతో విచారణ జరుపుతోంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు, వాటికయ్యే ఖర్చు వెల్లడించాలని ఈసీ కోరనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా అడ్డుకోలేనప్పటికీ, ఓటరుకు సమాచారం ఇచ్చే హక్కు ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
ప్రతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా నిర్దిష్ట ఫార్మాట్లో పన్ను, వ్యయాల వివరాలను అందించాలని ఈసీ ప్రతిపాదించింది. వాగ్దానం భౌతిక, ఆర్థిక పరిమాణాన్ని రూపొందించాలనే ఆలోచనతో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. అది వ్యవసాయ రుణమాఫీ అయితే, అది రైతులందరికీ అందుబాటులో ఉంటుంది. లేదా చిన్న, సన్నకారు రైతులకే అందుబాటులో ఉంటుంది. ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళిలో అవసరమైన మార్పులు చేసేముందు సంప్రదింపుల కోసం పార్టీలను పిలవాలని ఈసీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications