తప్పుడు ప్రకటనలతో మోసగిస్తే తాట తీస్తారు.. యాడ్స్ ఎండార్స్ చేసే సెలబ్రిటీలకు కేంద్రం ఝలక్..
ఢిల్లీ : బ్రాండ్ ప్రమోషన్ కోసం కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లపై ఆధారపడతాయి. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి. సెలబ్రిటీలతో యాడ్స్ రూపొందించి కస్టమర్లను ఆకట్టుకుంటాయి. అయితే వీటిలో చాలామటుకు వినియోగదారులను మోసగించేవే ఉంటాయి. చేసిన ప్రచారానికి వస్తువు చేసే పనికి పొంతనే ఉండదు. ఇకపై ఇలాంటివి చెల్లవంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇక మ్యానుఫ్యాక్చరర్లతో పాటు సర్వీస్ ప్రొవైడర్లు, చివరకు యాడ్స్లో నటించే సెలబ్రిటీలు సైతం ఆయా ప్రకటనలకు బాధ్యతవహించాలని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2019కు లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో బిల్లు గట్టెక్కి రాష్ట్రపతి సంతకం చేస్తే త్వరలోనే చట్టరూపం దాల్చనుంది.
తప్పుడు యాడ్స్ నియంత్రణ కోసం బిల్లు
ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2019 ప్రకారం టెలివిజన్, రేడియో, ప్రింట్, ఔట్ డోర్ యాడ్స్, ఈ కామర్స్, టెలిమార్కెటింగ్ ఇలా ఏ మాధ్యమంలో తప్పుడు ప్రకటనలు ఇచ్చినా అది శిక్షార్హమవుతుంది. సెలబ్రిటీలను చూసి ప్రొడక్ట్ కొనే కస్టమర్లు చాలా మందే ఉంటారు. ఈ నేపథ్యంలో కంపెనీల మోసాలకు కస్టమర్లు బలవకుండా ఉండేందుకు తప్పుడు ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలను బాధ్యులను చేయాలని ఈ బిల్లు చెబుతోంది. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయనున్నారు. ప్రొడక్ట్ క్వాలిటీ, క్వాంటిటీ, సర్వీస్ తదితర విషయాలు యాడ్స్లో చూపినట్లుగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఈ సంస్థ చూసుకుంటుంది. ఫలితంగా కస్టమర్లు మోసపోయే అవకాశాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్లకు రూ.10లక్షల పెనాల్టీ
తప్పుడు యాడ్స్ నియంత్రణ కోసం ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారుల హక్కులు, తప్పుడు వ్యాపార విధాననాలు, మోసపూరిత అడ్వర్టైజ్మెంట్లను ఈ సంస్థ పర్యవేక్షించనుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2019 ప్రకారం తప్పుడు ప్రకటనలు ఇచ్చిన ఉత్పత్తిదారులు, సర్వీస్ ప్రొవైడర్లకు రెండేళ్ల శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. ఇలాంటి యాడ్స్ను ఎండార్స్ చేసే సెలబ్రీటీలకు కూడా రూ.10 లక్షల వరకు పెనాల్టీ విధించనున్నారు. ఇదే తప్పు మళ్లీ చేస్తే జరిమానా మొత్తాన్ని రూ.50లక్షలకు జైలు శిక్షను ఐదేళ్లకు పెంచనున్నారు. అంతేకాదు.. సదరు సెలబ్రిటీ ఏడాది వరకు వేరే ఏ అడ్వర్టైజ్మెంట్లు ఎండార్స్ చేయకుండా నిషేధం విధించనున్నారు. కేసు తీవ్రతను బట్టి నిషేధాన్ని మూడేళ్లకు పొడగించే అవకాశం కూడా ఉంది.
మోసపోతున్న కస్టమర్లు, బ్రాండ్ అంబాసిడర్లపై కేసులు
సెలబ్రిటీలు ఎండార్స్ చేసే యాడ్స్ను చూసి చాలా మంది కస్టమర్లు ఆయా వస్తువుల కొనుగోలు చేయడంతో పాటు సర్వీసులను ఎంచుకుంటారు. అయితే ఆయా సంస్థలు యాడ్స్లో చెప్పినట్లుగా కాకుండా ఇష్టానుసారం సేవలు అందించడంపై కస్టమర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మల్టీ లెవల్ మార్కెటింగ్తో జనాలకు కుచ్చుటోపీ పెట్టిన క్యూనెట్ వ్యవహారమే ఇందుకు తాజా ఉదహరణ. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, పూజా హెగ్డే, బొమన్ ఇరానీతో పాటు టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యూనెట్కు బ్రాండ్ ప్రమోట్ చేశారు. కంపెనీపై చీటింగ్ కేసు బుక్ కావడంతో సైబరాబాద్ పోలీసులు ఈ సెలబ్రిటీలందరికీ నోటీసులు పంపారు. వారం రోజుల్లో విచారణకు రావాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
కంపెనీల బుట్టలో యాక్టర్లు, క్రికెటర్లు
ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఫిట్నెస్ సెంటర్ కల్ట్ ఫిట్ కథే ఇలాంటిదే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంబాసిడర్గా ఉన్న కల్ట్ ఫిట్ సేవల అందించడంలో విఫలమైంది. పలుమార్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చినా స్పందించకపోవడంతో విసిగిపోయిన ఓ కస్టమర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన హృతిక్ రోషన్తో పాటు కల్ట్ ఫిట్ యాజమాన్యంపై కేసు బుక్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉంది. ఇక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆమ్రపాలి గ్రూప్ ఫ్లాట్ల పేరుతో జనాన్ని చేసిన మోసం అంతా ఇంతా కాదు. ఈ కంపెనీకి 2009 నుంచి 2015 వరకు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అయితే ఫ్లాట్ కొనుగోలుదారులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో 2016లో ఆయన ఒప్పందం నుంచి తప్పుకున్నారు. గతంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్కాం కేసులో కీలక సూత్రధారి సాయికుమార్ చేపట్టిన వన్ నేషన్ వన్ కార్డు స్కీంకు క్రికెటర్ సౌరవ్ గంగూలీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. స్కాం బయటపడటంతో ప్రమోషన్ నుంచి తప్పుకున్నారు.