కరోనా వైరస్: భారత్ స్టేజ్-3లోకి ప్రవేశం.. కొట్టిపారేసిన కేంద్రం, మెడికల్ కౌన్సిల్.. అసలు నిజం ఏంటంటే
యూరప్, అమెరికా దేశాల మాదిరి ఇండియాలోనూ కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్నదని, ఇప్పటికే మనదగ్గర వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) జరుగుతున్నదని, దాన్ని బట్టి స్టేజ్-3లోకి ప్రవేశించినట్లేనని రిపోర్టులు రావడంతో జనం ఒక్కసారిగా ఉలికకిపడ్డారు. ఇప్పటికే కరోనాకు సంబంధించి సోషల్ మీడియాలో భయానక మెసేజ్ లు చూస్తోన్న ప్రజలు.. ఇప్పుడు స్టేజ్-3 లోకి ప్రవేశించామన్న వార్తలతో భయకంపితులయ్యారు. అయితే దీనికి సంబంధించిన అసలు నిజాలు ఇలా ఉన్నాయి..
ఆ ప్రకటనతో భయం భయం..
ఇండియాలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్(స్టేజ్-3) ప్రారంభమైందంటూ డాక్టర్ గిరిధన్ గ్యానీ చెప్పిన విషయాన్ని ఓ ప్రఖ్యాత వెబ్ సైట్ ప్రముఖంగా ప్రచురించింది. డాక్టర్ గ్యానీ.. దేశంలో కొవిడ్-19 ఆస్పత్రుల ఏర్పాట్లకు సంబంధించి కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కు కన్వీనర్ కావడంతో ఆయన చెప్పిన విషయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ‘భారత్ స్టేజ్-3 లోకి ప్రవేశించింది'అన్న గ్యానీ స్టేట్ మెంట్ ఒక రకంగా కేంద్రం ప్రకటనలాగే జనంలోకి వెళ్లింది. దీనిపై తీవ్ర గందరగోళం ఏర్పడటంతో కేంద్రం క్లారిటీతో ముందుకొచ్చింది.
ఇదీ అసలు నిజం..
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నమాట నిజమే అయినప్పటికీ మనమింకా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) లేదా స్టేజ్-3లోకి ప్రవేశించలేదని కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పష్టం చేశాయి. భారత్ ఇప్పటికే స్టేజ్-3లోకి ప్రవేశించిందన్న మీడియా రిపోర్టులను ఆ సంస్థలు ఖండిచాయి. సదరు వార్తలు ప్రజల్నితప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం పీఐబీ, ఐసీఎంఆర్ సంస్థలు వేర్వేరు ప్రకటనలు చేశాయి.
భయపెట్టిన గ్యానీ వ్యాఖ్యలు..
భారత్ స్టేజ్-3లోకి ప్రవేశించిందని చెప్పడంతోపాటు కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోడానికి దేశం సమాయత్తం కాలేదని, రోగ లక్షణాలు ఉన్నవాళ్లందరికీ టెస్టులు చేసేందుకు కనీసం సరిపడా కిట్లు కూడా అందుబాటులో లేవని డాక్టర్ గిరిధర్ గ్యానీ చెప్పడం మరింత ఆందోళన రేపింది. ఒకరకంగా కరోనా విషయంలో కేంద్రం చేతులెత్తేసిందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంతో సదరు వార్త వైరల్ కావడం, సర్వత్రా దానిపై చర్చ జరిగింది. ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న 110 మందికి టెస్టులు చేయగా, 11 మందికి పాజిటివ్ వచ్చిందని, వాళ్లలో ఏ ఒక్కరు కూడా విదేశాల నుంచి రావడం లేదా విదేశాల నుంచి వచ్చినవాళ్లకు దగ్గరగా వెళ్లినవారు కారని, దాన్ని బట్టి దేశంలో స్టేజ్ -3 ప్రవేశించిందని భావించొచ్చని గ్యానీ అన్నారు. అయితే ఆయనా ప్రకటనకు ముందే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో వైరస్ లోకల్ వ్యాప్తి ఎక్కడా లేదని స్పష్టం చేశారు.
ఇదీ దేశంలో పరిస్థితి..
వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఒక్కొక్కటిగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 947కు పెరగగా, మరణాల సంఖ్య 27కు చేరింది. కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలూ కరోనా వ్యాప్తిపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఆదివారం నాటి మన్ కీ బాత్ లోనూ ప్రధాని మోదీ కరోనాపైనే మాట్లాడి, అసలేం జరుగుతుందో ప్రజలకు వెల్లడించే అవకాశమున్నట్లు తెలిసింది.