న్యూ ఇయర్ ధమాకా ఆఫర్ను ప్రకటించిన ప్రధాని మోదీ- చిన్నమొత్తాల వడ్డీ రేటు పెంపు..!!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరం ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మందికి లబ్ది కలిగించే ప్రకటన ఇది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటును పెంచింది. 1.1 శాతం మేర వడ్డీ రేటును పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటనను విడుదల చేసింది. పంటి కింద రాయిలాగా ఈ వడ్డీ రేటు పెంపును పరిమితం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ చివరి త్రైమాసికానికి మాత్రమే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిదైన నాలుగో త్రైమాసికానికి మాత్రమే పరిమితం చేసింది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన వడ్డీ రేటు అమలులోకి రానుంది. జనవరి 1 - మార్చి 31వ తేదీ మధ్యకాలానికి మాత్రమే చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పెంచిన వడ్డీరేటు వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంతో పాటే మార్చి 31వ తేదీన ఇదీ ముగుస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభ తేదీ ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఇది అమలులో ఉండదు.
సేవింగ్స్ కు నో పెంపు..
సేవింగ్స్ డిపాజిట్లకు మినహాయింపు ఇచ్చింది. వీటిని ఈ పెంపు పరిధిలోకి తీసుకుని రాలేదు. టైమ్ డిపాజిట్లకు మాత్రమే వర్తింపజేసింది కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతం 4.0 శాతం వడ్డీరేటు ఉంది. దీన్ని అలాగే కొనసాగించనుంది. తొలి సంవత్సరం టైమ్ డిపాజిట్లపై 5.5 నుంచి 6.6, రెండో సంవత్సరం టైమ్ డిపాజిట్పై 5.7 నుంచి 6.8, మూడో సంవత్సరం టైమ్ డిపాజిట్పై 5.8 నుంచి 6.9, అయిదో సంవత్సరం టైమ్ డిపాజిట్పై 6.7 నుంచి 7.0కు వడ్డీ రేటు పెరిగింది.
రికరింగ్ డిపాజిట్లపై..
అయిదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపైనా వడ్డీరేటులో మార్పు లేదు. ప్రస్తుతం ఉన్న 5.8 శాతాన్ని అలాగే కొనసాగించనుంది. సీనియర్ సిటిజన్ల సేవింగ్ పథకాలపై 7.6 నుంచి 8.0, మంత్లీ ఇన్ కమ్ అకౌంట్ స్కీమ్పై 6.7 నుంచి 7.1, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్పై 6.8 నుంచి 7.0, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వడ్డీరేటులో కూడా మార్పులు చేయలేదు. 7.1 శాతం వడ్డీరేటును కొనసాగించింది.
కిసాన్ వికాస్ పత్రాలపై..
123 నెలల్లో మెచ్చూర్ అయ్యే కిసాన్ వికాస్ పత్రపై 7.0, 120 నెలల తరువాత మెచ్యూర్ అయ్యే పత్రాలపై 7.2 శాతం వడ్డీ రేటు పెంచింది. సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీమ్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడున్న 7.6 వడ్డీ రేటును యధాతథంగా కొనసాగించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమొరాండాన్ని విడుదల చేసింది.