మూక హత్యలపై కేంద్రం ప్రత్యేక కమిటీ: 4వారాల్లో నివేదిక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూక దాడులు, హత్యలను నిరోధించేందుకు అవసరమైన సూచనలు అందించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది.
హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ నాలుగు వారాల్లోగా తన నివేదికను సమర్పిస్తుంది. మూక హత్యలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టంతో ముందుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
శాంతిభద్రతలను మూకలు తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించరాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మూక హత్యలపై మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రధాని నరేంద్ర మోడీకి తమ సిఫార్సులను సమర్పించనుంది.
దాడులు, మూక హత్యలపై సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను గౌరవిస్తామని, రాష్ట్రాలకూ ఈ తరహా దాడులను నిరోధించేలా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.