Black Fungus అంతు చూడ్డానికి ఆ ఇంజెక్షన్: భారీగా ఉత్పత్తికి కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. ఇది అరుదైన ఫంగస్. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి. దేశ రాజధానితో పాటు మహారాష్ట్రలోని పుణె, గుజరాత్లోని అహ్మదాబాద్, వడోదర, ఒడిశా రాజధాని భువనేశ్వర్, కటక్ వంటి నగరాల్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్నవారిని లక్ష్యంగా చేసుకుని విజృంభిస్తోంది ఈ ఫంగస్. వైద్య పరిభాషలో దీన్ని మ్యూకోర్మైసిస్గా పిలుస్తారు.
ఈ ఫంగస్ సోకితే రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మనుషులకు అరుదుగా సోకే లక్షణం దీనికి ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. కరోనా వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే ఆ పేషెంట్లకు ఈ ఫంగస్ వెంటనే సోకుతోందనేది నిపుణుల వాదన. ఊపిరి తీసుకున్నప్పుడు ఈ ఫంగస్ శరీరంలోకి చేరుతాయి. ఊపిరితిత్తుల్లో తిష్ఠ వేస్తాయి. ఈ ఫంగస్ సోకిన వారు కంటి చూపు కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పేషెంట్లలో కళ్ల దగ్గర వాపు వస్తుందని, ఆరోగ్య పరీక్షలను నిర్వహించిన సమయంలో కొన్ని సున్నిత అవయవాల వద్ద నల్లటి మచ్చలు ఇది కనిపిస్తుందని అంటున్నారు.
దీన్ని నివారించడానికి యాంఫోటెరిసిన్ బీ (Amphotericin B) ఇంజెక్షన్ను వినియోగించాల్సి వస్తోంది. ఈ మధ్యకాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చిన తరువాత.. పలు నగరాల్లో ఈ ఇంజెక్షన్ కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చాలినన్ని యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను సరఫరా చేయడానికి అవసరమైన నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఫార్మా సూటికల్స్ కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది.