Today in Parliament: సీబీఐ, ఈడీ అయిదేళ్ల పదవీకాలం: సభలో కీలక బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో మొదలైన ఈ పరంపర కొనసాగుతోంది. పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది. సెలెక్ట్ కమిటీకి పంపించినవి పరిమతంగా ఉంటోన్నాయి. ఇవ్వాళ మరో కీలక బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. దీనిపై పెద్దల సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధిపతుల పదవీ కాలాన్ని గరిష్ఠంగా అయిదు సంవత్సరాల పాటు పొడిగించేలా రూపొందించిన బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎష్టాబ్లిష్మెంట్ (అమెండ్మెంట్) బిల్లు 2021, ది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (అమెండ్మెంట్) బిల్లు 2021ను ఆయన సభ ఆమోదం కోసం టేబుల్ చేయనున్నారు.
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ల పదవీ కాలాన్ని అయిదేళ్ల పాటు పొడిగించాలని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూపొందించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటికే ఈ రెండు దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా పనిచేయట్లేదని, స్వతంత్రంగా వ్యవహరించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి అదనంగా ఈ రెండింటి డైరెక్లర్ పదవీ కాలాన్ని అయిదేళ్ల పాటు పొడిగించడం సహేతుకం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కేంద్రంలో అధికారంలో పార్టీ తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను ఈ పదవిలో ఒక్కసారి నియమిస్తే.. అయిదు సంవత్సరాలు పాటు ఇక వారిని బదిలీ చేసే వీలు లేకుండా ఈ చట్టాన్ని రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల గరిష్ఠ కాలపరిమితిని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజ్యసభలో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందుతాయా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.
కాగా- మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి ఉద్దేశించిన బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దీన్ని ప్రవేశపెట్టారు. నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) బిల్లు 1985ను సవరించారు. ఈ బిల్లులో ఉన్న కొన్ని లోపాలను సవరించి.. దీన్ని మరింత బలోపేతం చేసేలా.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. దీన్ని సభ ఆమోదించింది.